అసహనంపై రఘువీర్, 'బాహుబలి' నవల రాస్తున్నా
అహ్మదాబాద్: అసహనం పేరిట కొందరు రచయితలు అవార్డులు వెనక్కి ఇవ్వడాన్ని 2015 జ్ఞాన్పీఠ్ అవార్డుకు ఎంపికైన గుజరాత్ రచయిత రఘువీర్ చౌదరి తప్పుబట్టారు. అవార్డులు వెనక్కి ఇచ్చేయడం వారి అపరిపక్వతకు నిదర్శనమని అభిప్రాయపడ్డారు.
జ్ఞాన్పీఠ్ అవార్డు అందుకున్న నాలుగో గుజరాత్ రచయిత రఘువీర్ చౌదరి. అతను 1977లో సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు. ఉపర్వాస్ రచనకు గాను ఆయన దానిని అందుకున్నారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన నాయకులను గద్దె దిగాలని రచయితలు చెప్పడం సరికాదన్నారు.
వారి టర్మ్ పూర్తి కానివ్వాలన్నారు. ప్రస్తుత పరిస్థితి ఎమర్జెనీలా ఏమీ కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. మనది ప్రజాస్వామ్యయత దేశమన్నారు. నిరసన తెలిపేందుకు అవార్డులు వెనక్కి ఇవ్వడం సరైన మార్గం కాదని ఆయన చెప్పారు.
ప్రజల దృష్టిని తమవైపు తిప్పుకోవడంలో ఆ రచయితలు విజయవంతమయ్యారన్నారు. అవార్డులు వెనక్కు ఇస్తున్న వారు ఓ విషయం కచ్చితంగా తెలుసుకోవాలని, అకాడమీ దేశాన్ని పాలించడం లేదని, అయినప్పటికీ మృతి చెందిన వారి విషయంలో అకాడమీ విచారం వ్యక్తం చేసిందన్నారు.
77 ఏళ్ల రఘువీర్ 51వ జ్ఞానపీఠ్ అవార్డుకు ఎంపికయ్యారు. ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు.
ప్రస్తుతం బాహుబలి పేరిట పురాణాల్లో ఉండే పాత్రలతో ఓ నవలను రాస్తున్నట్లు రఘువీర్ చౌదరి చెప్పారు. దీని ద్వారా అహింసపై ఈ తరానికి సందేశం ఇస్తున్నట్లు చెప్పారు.

బిజెపిపై సోనియా గాంధీ ఆగ్రహం
మతతత్వ దురభిమానం, పక్షపాత ధోరణులను వ్యాపింపజేయడం ద్వారా ప్రఖ్యాత సంఘసంస్కర్త శ్రీ నారాయణ గురు వారసత్వాన్ని రాజకీయ లబ్ధికోసం వాడుకోవాలని మతతత్వ శక్తులు, వ్యక్తులు ప్రయత్నిస్తున్నారంటూ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ బుధవారం బిజెపిపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు.
కేరళలోని శివగిరి మఠం- నారాయణ గురు నిలయం వద్ద 83వ వార్షిక తీర్థయాత్ర ప్రారంభం సందర్భంగా బుధవారం సోనియా ప్రసంగించారు. విశ్వశాంతి, మతసామరస్యం, సామాజిక న్యాయం, సమానత్వం స్థాపన దిశగా అన్ని మతాలను గౌరవించాల్సిందిగా నారాయణగురు బోధించారన్నారు.
దేశంలో ఇప్పటికీ కుల వివక్ష ఉండటం విచారకరమని వ్యాఖ్యానించారు. వివక్ష ఏ రూపంలోనూ ఉండకుండా నిర్మూలించడం ప్రజలందరి బాధ్యత అని సూచించారు. కేరళలో ప్రాబల్యమున్న ఎఝావ వర్గానికి చెందిన శ్రీ నారాయణ ధర్మ పరిపాలన సంఘం(ఎస్ఎన్డీపీ) బిజెపితో ఎన్నికల పొత్తు కుదుర్చుకునే ప్రయత్నాల్లో ఉండటాన్ని సోనియా విమర్శించారు.
రాజకీయ లబ్ధి కోసం బిజెపితో ఎస్ఎన్డీపీ జట్టు కట్టడమంటే నారాయణగురు బోధనలను వ్యతిరేకించడమేనన్నారు. ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ, సీపీఐ ప్రధాన కార్యదర్శి సుధాకర్ రెడ్డి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications