మోడీకి అక్కడే సోనియా హెచ్చరిక, పొత్తుపై కౌంటర్
తిరువనంతపురం: మతతత్వ దురభిమానం, పక్షపాత ధోరణుల్ని వ్యాపింపజేయడం ద్వారా సంఘసంస్కర్త శ్రీ నారాయణ గురు వారసత్వాన్ని రాజకీయ లబ్ధికోసం వాడుకోవాలని మతతత్వ శక్తులు ప్రయత్నిస్తున్నారంటూ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ బుధవారం బిజెపిపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు.
కేరళలోని శివగిరి మఠం- నారాయణ గురు నిలయం వద్ద 83వ వార్షిక తీర్థయాత్ర ప్రారంభం సందర్భంగా బుధవారం సోనియా ప్రసంగించారు. విశ్వశాంతి, మతసామరస్యం, సామాజిక న్యాయం, సమానత్వం స్థాపన దిశగా అన్ని మతాలను గౌరవించాల్సిందిగా నారాయణగురు బోధించారన్నారు.
దేశంలో ఇప్పటికీ కుల వివక్ష ఉండటం విచారకరమని వ్యాఖ్యానించారు. వివక్ష ఏ రూపంలోనూ ఉండకుండా నిర్మూలించడం ప్రజలందరి బాధ్యత అని సూచించారు. కేరళలో ప్రాబల్యమున్న ఎఝావ వర్గానికి చెందిన శ్రీ నారాయణ ధర్మ పరిపాలన సంఘం(ఎస్ఎన్డీపీ) బిజెపితో ఎన్నికల పొత్తు కుదుర్చుకునే ప్రయత్నాల్లో ఉండటాన్ని సోనియా విమర్శించారు.

రాజకీయ లబ్ధి కోసం బిజెపితో ఎస్ఎన్డీపీ జట్టు కట్టడమంటే నారాయణగురు బోధనలను వ్యతిరేకించడమేనన్నారు. ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ, సీపీఐ ప్రధాన కార్యదర్శి సుధాకర్ రెడ్డి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
కాగా, ఈ నెల 15వ తేదీన శివగిరి మఠాన్ని సందర్శించిన ప్రధాని మోడీ.. పార్లమెంటు శీతాకాల సమావేశాలను కాంగ్రెస్ పార్టీ అడ్డుకోవడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని ఎగతాళి చేస్తోందని విమర్శించారు. దానికి కౌంటర్గా సోనియా అక్కడే కేంద్రంపై మండిపడ్డారు.
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హయాంలో కంప్యూటరీకరణను వ్యతిరేకించిన వామపక్షాలు, ఇతర రాజకీయ పార్టీలు దేశంలో సాంకేతికత విస్తరణ ఘనతను ప్రస్తుతం తమదిగా చెప్పుకుంటున్నాయని ఆరోపించారు. ఎన్నో విమర్శలు, అపహాస్యాలు, రాజకీయ దాడులు ఎదుర్కొన్నప్పటికీ రాజీవ్ గాంధీ దృఢచిత్తంతో దేశ సమాచార సాంకేతికరంగంలో మార్పులు తీసుకు వచ్చారన్నారు.












Click it and Unblock the Notifications