అయోధ్య మసీదుకు ఆది నుండీ విఘాతాలే .. తాజాగా స్థలం విషయంలో కోర్టులో మరో వివాదం
రామజన్మభూమి బాబ్రీ మసీదు వివాదంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత అయోధ్యలో రామమందిర నిర్మాణ పనులు ప్రారంభం కాగా, మసీదు నిర్మాణానికి కూడా రిపబ్లిక్ డే రోజున శ్రీకారం చుట్టారు. రామ మందిర నిర్మాణం కోసం దేశ ప్రజలందరినీ కదిలించేలా నిధుల సేకరణ జరుగుతుండగా, మసీదు నిర్మాణానికి కూడా చందాలను స్వీకరిస్తున్నట్లుగా ట్రస్టు సభ్యుడు అధర్ హుస్సేన్ చేసిన ప్రకటనపై పెద్ద దుమారం రేగగా తాజాగా అయోధ్య మసీదు విషయంలో మరో వివాదం చెలరేగింది.
అయోధ్యలో మసీదుపై ఓవైసీ సంచలన వ్యాఖ్యలు.. అలాంటి మసీద్ లో నమాజ్ కూడా వద్దు
మసీదు స్థలం తమదేనంటూ కోర్టుకెళ్ళిన ఢిల్లీకి చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు
మొన్నటికి మొన్న అయోధ్య మసీదు కోసం విరాళాలు సేకరిస్తున్నామని ట్రస్ట్ సభ్యుడు చేసిన ప్రకటనపై అసదుద్దీన్ ఓవైసీ అలా విరాళాలు సేకరించి నిర్మించిన మసీదులో నమాజు కూడా చేయకూడదంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.ఇక తాజాగా అయోధ్య మసీదు భూమి తమదేనంటూ ఢిల్లీకి చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రామ్ జన్మభూమి-బాబ్రీలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం అయోధ్యలో మసీదు నిర్మాణానికి ఉత్తర ప్రదేశ్ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డుకు కేటాయించిన ఐదు ఎకరాల భూమిని తమదని పేర్కొంటూ ఢిల్లీకి చెందిన ఇద్దరు సోదరీమణులు బుధవారం అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు.
తమకు కేటాయించిన 28 ఎకరాల భూమిలోనే ఐదెకరాలు మసీదుకు ఇచ్చారని పిటీషన్
అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ ముందు ఈ నేపధ్యంలో పిటిషన్ దాఖలైంది . ఇక ఈ కేసు ఫిబ్రవరి 8 న విచారణకు వచ్చే అవకాశం ఉంది.రాణి కపూర్ అలియాస్ రాణి బలూజా మరియు రామ రాణి పంజాబీ తమ తండ్రి జ్ఞాన్ చంద్ర పంజాబీ 1947 లో పంజాబ్ నుండి విభజన సమయంలో భారతదేశానికి వచ్చి ఫైజాబాద్ (ఇప్పుడు అయోధ్య) జిల్లాలో స్థిరపడ్డారని రిట్ పిటిషన్లో పేర్కొన్నారు. తమ తండ్రికి ధన్నిపూర్ గ్రామంలో 28 ఎకరాల భూమిని నాజుల్ డిపార్టుమెంటు ఐదేళ్లపాటు కేటాయించిందని వారు పేర్కొన్నారు. తరువాత, అతని పేరును రెవెన్యూ రికార్డులలో చేర్చినట్లు పిటిషనర్లు తెలిపారు.
సెటిల్మెంట్ ఆఫీసర్ ముందు వివాదం ఉందని , బదిలీ ఆపాలని విజ్ఞప్తి
తన తండ్రికి కేటాయించిన భూమికి సంబంధించిన వివరాలను కొంతకాలం తర్వాత అధికారులు రెవెన్యూ రికార్డుల నుంచి తొలగించారని పేర్కొన్నారు. దీనిపై వారు సెటిల్మెంట్ ఆఫీసర్ కు ఫిర్యాదు చేశారని, ప్రస్తుతం సెటిల్ మెంట్ ఆఫీసర్ ముందు వివాదం పెండింగ్లో ఉన్నంత వరకు భూమిని బదిలీ చేయకుండా నిషేధించాలని రాణి బలూజా, రామ రాణి పంజాబీ పిటిషన్ లో పేర్కొన్నారు. ఇప్పుడు ఆ ఇరవై ఎనిమిది ఎకరాల భూమి నుంచి ఐదు ఎకరాల భూమిని సున్నీ వక్ఫ్ బోర్డుకు కేటాయించారని అక్కా చెల్లెళ్లు తమ పిటిషన్లో పేర్కొన్నారు .
అయోధ్య మసీదు నిర్మాణానికి మరో అడ్డంకి
వివాదం పెండింగ్లో ఉన్న కారణంగా బదిలీ చేయకుండా నిషేధించాలని కోర్టుకు విజ్ఞప్తి చెయ్యటంతో మసీదు నిర్మాణానికి మరో ఆటంకం ఎదురైంది . రామ్ జన్మభూమి-బాబ్రీ మసీదు వివాదంలో 2019 నవంబర్ 9 న సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా మసీదు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ధన్నిపూర్ గ్రామంలోని సున్నీ వక్ఫ్ బోర్డుకు ఐదు ఎకరాల భూమిని కేటాయించింది. అయోధ్యలో రామ మందిరం , అలాగే ధన్నీపూర్ లో మసీదు నిర్మాణానికి సిద్ధం అయింది .