పుత్రజీవక్పై రాందేవ్ బాబా వివరణ: 'మగబిడ్డే పుడతాడని నేను చెప్పలేదు'
న్యూఢిల్లీ: యోగా గురు రాందేవ్ బాబాకు చెందిన దివ్యా ఫార్మసీ తయారు చేస్తోన్న ఆయుర్వేద మెడిసిన్ 'పుత్రజీవక్' పై గురువారం రాజ్యసభలో చర్చ జరిగిన విషయం తెలిసిందే. దీనిపై శుక్రవారం రాందేవ్ బాబా స్పందించారు. పార్లమెంట్లో ఎంపీలు మాట్లాడేముందు సరైన హోం వర్క్ చేసి ఉంటే బాగుండేదని ప్రతిపక్షాలపై మండిపడ్డారు.
శుక్రవారం మీడియా సమావేశంలో రాందేవ్ బాబా మాట్లాడుతూ మెడిసిన్కు 'పుత్రజీవక్' అనే పేరు ఎలా వచ్చిందో వివరణ ఇచ్చారు. అంతే కాదు పుత్రజీవక్ తింటే మగబిడ్డే పుడతాడని తాను ఎప్పుడూ చెప్పలేదని యోగా గురువు రాందేవ్ బాబా స్పష్టం చేశారు.
తనపై అనవసరంగా లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. దివ్యా ఫార్మసీ సంస్ధ ఉత్పత్తి చేస్తున్న పుత్రజీవక్ అనేది కేవలం వృక్షజాతి పేరు మాత్రమేనని, ఆ పేరుకు మగబిడ్డ పుట్టడానికి సంబంధమే లేదని చెప్పారు. తనపై రాజకీయంగా కక్ష తీర్చుకునేందుకే కొందరు నేతలు ఇలా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
పుత్ర జీవక్ మందు తింటే మగ బిడ్డనే జన్మిస్తాడని నేనెప్పుడూ ఎక్కడా చెప్పలేదని అన్నారు. 'పుత్రంజివా రాక్సోబుర్గి'కి చెందిన వృక్షజాతి పేరే పుత్రజీవక్. గుజరాతీ, హిందీ, కన్నడలో పుత్రజీవక్ అని పిలుస్తారని తెలిపారు.
మెడిసిన్ పేరు మార్చేందుకు తాము సిద్ధంగా లేమని కూడా స్పష్టం చేశారు. పార్లమెంట్లో చర్చ జరిపేందుకు బ్లాక్ మనీ, అవినీతి, భూకంప సహాయక చర్యలు లాంటివి ఉండగా, అనవసర విషయాలను వివాదంలోకి తెస్తున్నారంటూ మండిపడ్డారు. మెడిసిన్పై దుష్ప్రచారం చేసిన జనాతాదళ్ ఎంపీ కేసీ త్యాగిని క్షమాపణలు చెప్పాలని రాందేవ్ బాబా డిమాండ్ చేశారు.
గురువారం సభ ప్రారంభం కాగానే జనతాదళ్ యునైటెడ్ పార్టీకి చెందిన ఎంపీ కేసీ త్యాగి సభలోకి 'పుత్రజీవక్ బీజ్' అనే ఆయుర్వేద మెడిసిన్ ప్యాకెట్ను తీసుకొచ్చారు. ఈ ప్యాకెట్ను ప్రదర్శిస్తూ, ఈ ప్యాకెట్ను తాను దివ్యా ఫార్మసీ షాపులో తెచ్చానని, మగపిల్లలు పుడతారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు.
ఏప్రిల్ 14న తాను దీనిని తీసుకొన్నట్లు రశీదును కూడా సభలో ప్రదర్శించారు. హర్యానా రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న రాందేవ్ బాబాకు చెందిన దివ్యా ఫార్మసీ 'పుత్రజీవక్ బీజ్' అనే ఆయుర్వేద మెడిసిన్ను అందిస్తోంది. దీనిని వాడిన వారికి మగ సంతానం కలుగుతోందని ప్రచారం చేస్తోంది.
ఇలా తప్పుడు ప్రచారం కల్పించడం చట్ట విరుద్ధం, రాజ్యాంగేతరమైన చర్యగా పేర్కొంటూ దానిని వెంటనే నిషేధించి, దివ్యా ఫార్మసీ తయారీదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.