అది కావాలంటే ఇది చేయాల్సిందే.. బాబా రామ్ దేవ్ శాంతి సూత్రం
ఢిల్లీ : పుల్వామా ఉగ్రదాడిని ప్రతి ఒక్కరూ ఖండిస్తున్నారు. కొందరైతే ఆ దాడి నుంచి ఇంకా కోలుకోలేదు. ఉగ్రదాడితో 40 మందికి పైగా జవాన్లను పొట్టనపెట్టుకోవడానికి కారణమైన పాకిస్థాన్ ను భారతావని ముక్తకంఠంతో ఖండిస్తోంది. ఈ క్రమంలో పుల్వామా ఉగ్రదాడిపై ప్రముఖ యోగా గురువు బాబా రామ్ దేవ్ మరోసారి స్పందించారు. పాకిస్థాన్ ను వదిలిపెట్టొద్దని.. భారత్ సరైన చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడ్డారు. రైజింగ్ ఇండియా సమ్మిట్ లో పాల్గొన్న బాబా రామ్ దేవ్.. శాంతి నెలకొల్పడానికి కావాల్సిన పలు అంశాలను ప్రస్తావించారు.
బాబా రామ్ దేవ్ మాటల్లోనే :
భారత్ అంటే శాంతి కోరుకునే దేశం. అది మన సంప్రదాయం కూడా. మనం శాంతి కోసం తాపత్రాయపడుతుంటే.. పాకిస్థానీలు మాత్రం హింస కోరుకుంటున్నారు. అది మంచిది కాదు. అయినా వారికి అదంటేనే ఇష్టం. ప్రశాంతంగా జీవించే మనపై వాళ్ల చూపు తప్పుగా ఉంటోంది. అందుకే వారి కళ్లు పీకేయాలి.
ఒకరకంగా చెప్పాలంటే పాకిస్థాన్ ను ప్రక్షాళన చేయాల్సిన సమయమొచ్చింది. శాంతి కావాలంటే పోరాటం చేయక తప్పదు. పాకిస్థాన్ కు తగిన బుద్ధి చెప్పాలంటే భారత్ కూడా అదే రూట్ లో వెళ్లాలి. పాకిస్థాన్ ఏ మార్గంలో భారత్ ను టార్గెట్ చేస్తోందో.. అదే మార్గంలో ఆ దేశానికి తగిన శాస్తి చేయాలి. దీన్నిబట్టి అమాయకులను పొట్టనపెట్టుకోవాలని నేను చెప్పడం లేదు.. అదే సందర్భంలో భారత్ కు శాంతి లభించాలంటే పోరాటం చేయక తప్పదని అన్నారు.