Pushkar Dhami : బ్యాడ్ లక్ సీఎం-పార్టీని గెలిపించి-అనూహ్యంగా ఓడిపోయిన పుష్కర్ థామీ
ఇవాళ వెలువడిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బీజేపీ శిబిరంలో ఎక్కడ లేని సంతోషం నింపాయి. ముఖ్యంగా 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం తర్వాత బీజేపీ ఇంత సంతోషంగా ఉండటం ఇదే తొలిసారి. ఇలాంటి సందర్భంలో ఉత్తరాఖండ్ లో ఆ పార్టీ సీఎం అభ్యర్ధి పుష్కర్ ధామీ మాత్రం అనూహ్యంగా ఓటమి పాలయ్యారు.
ఉత్తరాఖండ్ లోని ఖతిమా నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన పుష్కర్ థామీ.. అనూహ్యంగా 6579 ఓట్ల తేడాతో తన ప్రత్యర్ధి, కాంగ్రెస్ అభ్యర్ధి భువన్ కాప్రీ చేతుల్లో ఓడిపోయారు. బీజేపీ గత ఐదేళ్లలో ఉత్తరాఖండ్ లో మార్చిన ముగ్గురు ముఖ్యమంత్రుల్లో పుష్కర్ ధామీ చివరి సీఎం. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో పార్టీ విజయాన్ని తన భుజాలపై వేసుకుని ఊరూరా తిరిగి గెలిపించిన థామీ.. తాను మాత్రం సొంత నియోజకవర్గంపై దృష్టి పెట్టలేదా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తున్న నేపథ్యంలో సీఎంగా పుష్కర్ థామీకి మరోసారి అవకాశం దక్కేది. కానీ ఇప్పుడు ఆయన ఓటమి పాలవ్వడంతో మరో అభ్యర్ధి తెరపైకి రాబోతున్నారు. అయితే అసలు పుష్కర్ థామీ ఎందుకు ఓడిపోయారనే చర్చ కూడా రాష్ట్రంలోనూ, బీజేపీ పార్టీలోనూ కొనసాగుతోంది. ప్రచారాన్ని సరిగా నిర్వహించకపోవడం, సీఎంగా తన సత్తాను నిరూపించుకోవడానికి తగిన సమయం లభించకపోవడం, పదవీకాలంలో సాధారణ ప్రజలకు దూరం కావడం ఆయన ఓటమికి కారణమని ఖతిమా నియోజకవర్గంలో స్థానికులు చెబుతున్నారు.
ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పటికీ థామీ.. ఖతిమాలో తన సీటును కోల్పోవడం షాకింగ్ అని పార్టీ నేత, అయన సన్నిహితుడైన కైలాష్ మన్రాల్ తెలిపారు. ఇలా ఎందుకు జరిగిందనేది అధ్యయనం చేయాల్సి ఉందన్నారు. సిఎం ఓటమి రాష్ట్రానికి కొత్త కాదు కానీ పార్టీ పూర్తి మెజారిటీతో వచ్చినప్పుడు, సిఎం ఓటమి పార్టీ హైకమాండ్కు ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన విషయమని మన్రాల్ అన్నారు.