మోడీ కేబినెట్లో ఒడిశా మోడీ
ఢిల్లీ : దేశ రాజకీయాల్లో ఆయనో సంచలనం.. నిబద్ధతకు నిలువెత్తు నిదర్శనం. ప్రజాసేవకే జీవితం అంకితం చేసిన ఆయన బడుగు బలహీనవర్గాలకు ఆశాజ్యోతి. ఆయనే ప్రతాప్ చంద్ర సారంగి. ఒడిశా మోడీగా ఫేమస్ అయిన సారంగి తొలిసారి ఎంపీగా ఎన్నికవడమే కాదు.. కేంద్ర కేబినెట్లో స్థానం సంపాదించుకున్నారు.
58 మందితో కోలువుదీరిన మోడీ మంత్రివర్గం. ..క్యాబినెట్లో చోటు దక్కినవారు వీరే...
ఒడిశా మోడీ
ఒడిశా మోడీగా ఇటీవల మీడియాతో పాటు సోషల్ మీడియాలో సంచలనంగా మారిన సారంగి బాలాసోర్ నుంచి విజయం సాధించారు. గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన.. ఇప్పుడు కేంద్రమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఆయన ప్రమాణస్వీకారానికి వస్తుండగా... పలువురు ప్రముఖులు, కార్యక్రమానికి హాజరైన అతిధులు స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. ఇది చాలు ఆయన గొప్పతనమేంటో అర్థం అవుతుంది.
మోడీ కేబినెట్లో సహాయమంత్రి
నిరాడంబర జీవితం, సైద్దాంతిక నిబద్ధతతో కూడిన రాజకీయాలు చేస్తూ ప్రధాని మోడీ దృష్టిని సారంగి ఆకర్షించారు. ఆకారణంగానే కేంద్ర సహాయమంత్రి బెర్త్ దక్కింది. బాలాసోర్ నుంచి ఎన్నికైన తర్వాత కూడా పూరి గుడిసె ఆయన నివాసం. సైకిల్పైనే సవారీ. భుజాన సంచీ వేసుకుని, కుర్తా పైజామాలో సాదాసీదాగా కనిపిస్తారు. ఆ నిరాడంబరతే ఇప్పుడు ఆయనను కేంద్రమంత్రివర్గంలో సహాయ మంత్రిని చేసింది.
గిరిజనుల కోసం జీవితం అంకితం
64ఏళ్ల వయసున్న ప్రతాప్ చంద్ర సారంగికి ఎంతోకాలంగా బీజేపీతో అనుబంధం ఉంది. ఆర్ఎస్ఎస్, వీహెచ్పీ కార్యకర్త అయిన ఆయన.. 2004, 2009 ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో నీలగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. పదవిలో ఉన్నప్పుడు తనకు అందే జీత భత్యాల, ఆ తర్వాత వస్తున్న పెన్షన్ను గిరిజన ప్రాంతాల్లో పేద విద్యార్థుల చదువులకు ఖర్చు చేస్తున్నారు. 2014లో బాలాసోర్ నుంచి లోక్సభకు పోటీ చేసి ఓటమి పాలైన ఆయన.. ఈసారి ఎన్నికల్లో దాదాపు 13వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.