కుమ్మక్కయ్యారు అడ్డంగా దొరికారు: బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో వెలుగుచూసిన మరో కుంభకోణం
దేశంలో ఆర్థిక నేరాలు మితిమీరిపోతున్నాయి. రెండేళ్ల క్రితం విజయ్ మాల్యా, ఈ ఏడాది నీరవ్ మోడీ. ఇలా వీరికి సహకరిస్తున్నది కూడా కొందరు ఇంటి దొంగలే కావడం విస్మయానికి గురి చేస్తోంది. తాజాగా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఎండీ మరియు సీఈఓ రవీంద్ర మరాఠీని పూణే ఆర్థిక నేర విభాగం అధికారులు అరెస్టు చేశారు. ఇతనితో పాటు ఈడీ రాజేంద్ర గుప్తా, మరో ఇద్దరు బ్యాంకు అధికారులను అరెస్టు చేశారు. DSKడెవెలపర్స్కు నిబంధనలను అతిక్రమించి వేల కోట్లలో లోన్లు మంజూరు చేశారనే ఆరోపణలపై వీరిని అధికారులు అరెస్టు చేశారు. పూణేకు చెందిన డెవలపర్ కులకర్ణి రూ.2,043 కోట్ల మేర మోసానికి పాల్పడటంతో ఆయన కంపెనీలపై విచారణ జరుగుతోంది. ఈ క్రమంలోనే తీగలాగిన అధికారులు డొంకను బయటపెట్టారు.
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ప్రధాన కార్యాలయం పూణేలో ఉంది. బ్యాంకు అధికారులు DSKడెవెలపర్స్తో కుమ్మక్కై నిబంధనలకు తూట్లు పొడుస్తూ పెద్ద మొత్తంలో డబ్బులను విడుదల చేశారని విచారణాధికారి పూణే ఏసీపీ నీలేష్ మోర్ వెల్లడించారు.
DSKడెవెలపర్స్ పై ఇప్పటికే చర్యలు తీసుకున్నట్లు బ్యాంకు వెల్లడించింది. ఆ సంస్థకు సంబంధించిన మరికొన్ని ఆస్తులను వేలం వేయాల్సి ఉందని పేర్కొంది. DSKడెవెలపర్స్ను విల్ ఫుల్ డీఫాల్టర్లుగా బ్యాంకు ప్రకటించింది. DSKడెవెలపర్స్ డ్రీమ్ సిటీ పేరుతో చేపట్టిన మెగా హౌజింగ్ ప్రాజెక్టులో కూడా అవకతవకలు జరిగినట్లుగా గుర్తించిన ఆర్థిన నేర విభాగం... మరో ఐదు జాతీయ బ్యాంకులకు చెందిన అధికారులను సైతం విచారణ చేస్తోంది.
ఈ ఐదు బ్యాంకులకు చెందిన అధికారులు 2016లో రూ.600 కోట్లు మంజూరు చేసినట్లు అభియోగాలున్నాయి. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర మొత్తం 100 కోట్లు మంజూరు చేయాల్సి ఉండగా... మార్చి 15, 2016లో ఆర్బీఐ నిబంధనలకు తూట్లు పొడుస్తూ ఒకే సారి 50 కోట్లు విడుదల చేసినట్లు అధికారులు గుర్తించారు.
బుధవారం బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఎండీ మరియు సీఈఓ రవీంద్ర మరాఠీతో పాటు ఇతర నిందితులను కోర్టులో హాజరుపర్చగా జూన్ 27 వరకు జడ్జి రిమాండ్ విధించారు. పెద్ద మొత్తంలో మోసం జరిగినందున విచారణాఅధికారులకు నలుగురిని విచారణ చేసేందుకు తగిన సమయం ఇవ్వాల్సిన అవసరముందని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు.