ఇక డీపీఐఎల్ వంతు: మరో రూ.2,654కోట్ల కుంభకోణాన్ని వెలికి తీసిన సీబీఐ
న్యూఢిల్లీ: కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) మరో భారీ కుంభకోణాన్ని వెలుగులోకి తెచ్చింది. గుజరాత్లోని వడోదరకు చెందిన డైమండ్ పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్(డీపీఐఎల్) అనే కంపెనీ రూ.2,654కోట్ల భారీ మోసానికి పాల్పడింది. ఈ కంపెనీపై సీబీఐ కేసు నమోదు చేసింది.
ఎలక్ట్రిక్ కేబుల్స్, పరికరాలు తయారుచేసే ఈ కంపెనీ డైరెక్టర్లు పలు బ్యాంకుల్లో రూ.2,654కోట్ల మోసాలకు పాల్పడ్డట్లు సీబీఐ పేర్కొంది. కంపెనీ డైరెక్టర్ల నివాసాలు, కార్యాలయాల్లో సీబీఐ సోదాలు నిర్వహిస్తోందని దర్యాప్తు సంస్థ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు.
ఈ కంపెనీలో ఎస్ఎన్ భట్నాగర్, ఆయన కుమారులు అమిత్ భట్నాగర్, సుమిత్ భట్నాగర్లు ఎగ్జిక్యూటివ్స్గా ఉన్నట్లు సీబీఐ వెల్లడించింది. 2016-17 సంవత్సరంలో ఈ కంపెనీ తీసుకున్న రుణం నిరర్ధక ఆస్తులుగా ప్రకటించారని తెలిపింది. ఈ కంపెనీ మోసపూరితంగా 11 బ్యాంకుల కన్సార్టియం (పబ్లిక్, ప్రైవేట్ బ్యాంకులు) నుంచి 2008 నుంచి రుణాలు తీసుకుని చెల్లించలేదని, 2016 జూన్ చివరి నాటికి కంపెనీ ఎగ్గొట్టిన రుణాలు రూ.2,654కోట్లకు చేరాయని సీబీఐ తెలిపింది.
రుణాలు చెల్లించని వారి జాబితాలో ఆర్బీఐ ఈ కంపెనీ, డైరెక్టర్ల పేర్లు చేర్చినప్పటికీ వారు పలుమార్లు వివిధ బ్యాంకుల నుంచి రుణాలు పొందినట్లు తెలుస్తోందని సీబీఐ వెల్లడించింది. అలాగే కంపెనీ తప్పుడు స్టాక్ స్టేట్మెంట్స్ చూపించిందని వెల్లడించింది. వరుసగా వెలుగు చూస్తున్న ఈ కుంభకోణాలు దేశంలో సంచలనంగా మారుతున్నాయి. సుప్రీంకోర్టు కూడా తాజాగా బ్యాంకులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. బ్యాంకులకు తెలిసే ఈ కుంభకోణాలు జరుగుతున్నాయని, అయినా ఎలాంటి స్పందనా లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది.