భారత్లో 'ఇండియాస్ డాటర్' నిషేధంపై ప్రధాని మోడీ ఏమన్నారు..?
న్యూఢిల్లీ: బ్రిటీష్ దర్శకురాలు లెస్లీ ఉడ్విన్ రూపొందించిన ఇండియాస్ డాటర్ డాక్యుమెంటరీని భారత్లో నిషేధించడంపై ప్రధాని నరేంద్రమోడీ స్పందించారు. 2012లో ఢిల్లీలో సంచలనం సృష్టించిన నిర్భయపై సామూహిక అత్యాచారం ఘటనను ఆధారంగా చేసుకుని లెస్లీ ఉడ్విన్ ఆ డాక్యుమెంటరీని రూపొందించిన సంగతి తెలిసిందే.
ఆ డాక్యుమెంటరీ ప్రజల మనోభావాలను దెబ్బతీసే అంశాలున్నాయన్న కారణంతో ప్రభుత్వం నిషేధించింది. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్న సందర్భంగా ప్రధాని మోడీ తన అధికారిక నివాసంలో టైమ్ మ్యాగజైన్కు ఇచ్చిన ఇంటర్యూలో ఈ డాక్యుమెంటరీపై ప్రధాని మోడీ తన అభిప్రాయాలను వెల్లడించారు.

ఇండియాస్ డాటర్ డాక్యుమెంటరీపై నిషేధం ఒక్క భావ ప్రకటనా స్వేచ్ఛకు సంబంధించిన అంశం కాదని, చట్టానికి సంబంధించిన అంశమని పేర్కొన్నారు. అందులో రెండు లేదా మూడు అంశాలున్నాయని పేర్కొన్నారు. ఏదైతే ఇంటర్వూ టెలికాస్ట్ అయిందో, దానిని దృష్టిలో పెట్టుకొని ఈ కేసులో బాధితులు, న్యాయ విచారణ విధానానికి తగిన గౌరవం ఇవ్వాల్సి ఉందన్నారు. ఈ కేసు ఇంకా జడ్జిమెంట్లో ఉందని, నేరం ఆరోపించబడిన వ్యక్తి ఇంటర్యూ ప్రసారమైనప్పటికీ, న్యాయ వ్వవస్ధ ప్రభావితం కాలేదని అన్నారు.
దీంతో పాటు కులం, మతం ప్రాతిపదికన మైనారిటీల పట్ల వివక్షను సహించబోమని తెలిపారు. మైనారిటీలపై ఇటీవల బీజేపీకి చెందిన కొందరు ఎంపీలు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను వెంటనే ఖండించామని చెప్పారు. దేశం మత ప్రాతి పదికన చీలికలు కారాదంటూ భారత పర్యటనలో ఒబామా చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు.
‘మతైక సహజీవనం అనేది మా రక్తంలో, నాగరికతలో, వ్యవస్థలోనే ఉంద'ని చెప్పారు. సుదీర్ఘ చరిత్రలో మరో దేశంపై భారత్ దాడిచేసిన ఉదంతం గానీ, తెగలు, మతం పేరిట యుద్ధాలు చేసిన ఉదాహరణ గానీ లేదన్నారు. భారత్- చైనా సరిహద్దు సమస్య పరిష్కార విషయంలో చరిత్ర నుంచి రెండు దేశాలు పాఠాలు నేర్చుకొంటున్నాయని అన్నారు. గత మూడు దశాబ్దాలుగా సరిహద్దుల్లో ఒక్క బుల్లెట్ కూడా పేలలేదని మోడీ గుర్తుచేశారు.
అదే విధంగా హిందుత్వ మతం కాదు, జీవన విధానం అన్న సుప్రీంకోర్టు వ్యాఖ్యలను ప్రధాని మోడీ ఉటంకించారు. ఈ దేశాన్ని పాలించడానికి నియంతృత్వం లేదంటే నిరంకుశ పాలనే మంచిదా అన్న ప్రశ్నకు గాను కాదు అనేది సమాధానంగా చెప్పారు. ప్రజాస్వామ్య పంథాలో సాగడమే తనకిష్టమని వివరించారు.
బ్రిటిష్ దర్శకురాలు రూపొందించిన ఈ ఇండియాస్ డాటర్ డాక్యుమెంటరీలో ఆడవారి పట్ల మగవారి మైండ్ సెట్ను కళ్లకు కట్టినట్లుగా తెరకెక్కించారు. మొత్తం 60 నిముషాల నిడివి ఉన్న ఈ వీడియోలో భారత్లో ఆడపిల్లకు రక్షణ లేదనే నిజాన్ని చెప్పింది. ఎన్నో వందల ఏళ్లనుంచి భారత్లో ఉన్న పురుషాధిక్యతను చూపింది. శిక్ష పడినా పశ్చాత్తాపం రాలేదనే యదార్ధాన్ని, ఆడదాన్ని కేవలం వంటింటి కుందేలుగానే భావిస్తారనే అసలు సత్యాన్ని చూపించింది.












Click it and Unblock the Notifications