ఒబామా బిజీ: సానుకూల ఫలితమే.., ప్రచారం కోసం చూసి జైలుకు...
న్యూఢిల్లీ: భారత్ వస్తున్న అమెరికా అధ్యక్షులు బరాక్ ఒబామా మూడు రోజుల పాటు బిజీబిజీగా గడపనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో వాణిజ్యం, అణు, విద్యుత్, సాంకేతిక పరిజ్ఞానం బదలీ, ఆరోగ్యం, రక్షణ, భద్రత, ఆర్థిక సహకారం వంటి అంశాలపై చర్చిస్తారు.
ఇద్దరు నేతలు ప్రాంతీయ, అంతర్జాతీయ సవాళ్ల పైన మాట్లాడుకుంటారు. ఒమాబా వెంట ఆయన సతీమణి మిచెల్లీ ఒబామా, ఉన్నతాధితారులు, చట్టసభ సభ్యులు ఉంటారు. ఒబామా కూతుళ్లు ఇద్దరు భారత్ పర్యటనలో గైర్హాజరు కానున్నారు.
25న ఉదయం పదిన్నర గంటలకు ఒబామా భారత్ చేరుకుంటారు. రాష్ట్రపతి భవన్లో స్వాగత కార్యక్రమం ఉంటుంది. మోడీతో కలిసి రాజ్ ఘాట్కు వెళ్లి మహాత్ముడి సమాధికి నివాళులు అర్పిస్తారు. హైదరాబాద్ హౌస్లో మోడీతో ద్వైపాక్షిక చర్యలు జరుపుతారు. అమెరికా బృందానికి విందు ఇస్తారు.

సాయంత్రం రాష్ట్రపతి ప్రణబ్తో భేటీ అవుతారు. ప్రణబ్ విందు ఇస్తారు. 26న గణతంత్ర వేడుకల్లో పాల్గొంటారు. సాయంత్రం బారత్, అమెరికాకు చెందిన సీఈవోలను ఉద్దేశించి ఇరువురు మోడీ, ఒబామా మాట్లాడుతారు. రాత్రి ఏడు గంటలకు 7 రేస్ కోర్సు రోడ్డులో మోడీ, ఒబామాకు విందు ఇస్తారు.
27న మన్ కీ బాత్ రేడియో కార్యక్రమంలో మోడీతో కలిసి పాల్గొంటారు. అనంతరం ఒబామా దంపతులు తాజ్ మహల్ సందర్శనకు ఆగ్రా వెళ్తారు. సాయంత్రం అమెరికాకు తిరుగు ప్రయాణమవుతారు. కాగా, ఒబామా భారత్ పర్యటన సానుకూల ఫలితాలు ఇస్తుందని అమెరికా రక్షణ కార్యదర్శి చుక్ హాగెల్ చెప్పారు.
ప్రచారం కోసం ప్రయత్నించి జైలుకు...
ఒబామాపై దాడి చేసేందుకు తీవ్రవాదులు కుట్ర పన్నారని ఫోన్ కాల్ చేసి 19 ఏళ్ల యువకుడు పోలీసులకు చెమటలు పట్టించాడు. విచారణ చేయగా ప్రచారం కోసమే తాను అలా చేసినట్లు ఒప్పుకున్నాడు. దీంతో అతనిని జైలుకు పంపించారు. దక్షిణ గోవాలోని కుంకోలిమ్ గ్రామానికి చెందిన ఓ యువకుడు బుధవారం ఉదయం ఢిల్లీలోని పోలీసు కంట్రోల్ రూంకు ఫోన్ చేశాడు.
ఒబామాపై దాడి చేయడానికి తీవ్రవాదులు కుట్ర పన్నారని, అందుకు సంబంధించిన సంభాషణల రికార్డింగ్ తన వద్ద ఉందని తెలిపాటు. పోలీసులు, భద్రతా సిబ్బంది రంగంలోకి దిగి యువకుడిని బుధవారం రాత్రి అరెస్టు చేసింది. విచారణ చేయగా అది ఉత్తిదేనని అంగీకరించాడు.












Click it and Unblock the Notifications