బెంగళూరులో పట్టపగలు బీజేపీ కార్పొరేటర్ భర్త దారుణ హత్య, వేటకోడవళ్లతో వెంటాడి!
బెంగళూరు: బెంగళూరులో పట్టపగలు బీజేపీ మహిళా కార్పొరేటర్ భర్తను అతి దారుణంగా హత్య చేశారు. ఇంటి సమీపంలో నిర్మిస్తున్న దేవాలయం పనులు పరిశీలించడానికి వెళ్లిన మహిళా కార్పొరేటర్ రేఖా కదిరేష్ భర్త కదిరేష్ ను ప్రత్యర్థులు అతిదారుణంగా హత్య చేశారు.
దేవాలయం
బెంగళూరులోని 138 వార్డు కార్పొరేటర్ రేఖా కదిరేష్ భర్త కదిరేష్ కాటన్ పేటలోని అంజనప్ప గార్డెన్ లో కదిరేష్ దేవాలయం నిర్మిస్తున్నారు. బుధవారం సాయంత్రం కదిరేష్ దేవాలయం దగ్గర జరుగుతున్న పనులు పరిశీలించడానికి వెళ్లారు.
వేటకోడవళ్లతో దాడి
ఆ సమయంలో ప్రత్యర్థులు వేటకోడవళ్లతో కదిరేష్ మీద విరుచుకుపడ్డారు. కదిరేష్ వెంట ఉన్న ఆయన అనుచరులు ప్రాణభయంతో పరుగు తీశారు. కదిరేష్ తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. అయితే ప్రత్యర్థులు వెంటాడి నరికేశారు. తీవ్ర కత్తిపోట్లకు గురైన బీజేపీ మహిళా కార్పొరేటర్ రేఖా కదిరేష్ భర్త కదిరేష్ మరణించాడు.
మాజీ రౌడీషీటర్
కదిరేష్ మాజీ రౌడీ. కదిరేష్ దగ్గర బెక్కిన కన్ను రాజేంద్ర అనే రౌడీషీటర్ అనుచరుడిగా ఉండేవాడు. తరువాత విభేదాలు వచ్చి ఇద్దరూ విడిపోయారు. పాతకక్షల కారణంగా కదిరేష్ ను హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ముందు జాగ్రత్త చర్యగా కాటన్ పేటలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
రెండో కార్పొరేటర్ భర్త
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇప్పటి వరకూ 25 మంది హిందూ సంఘ, సంస్థల నాయకులు, కార్యకర్తలు హత్యకు గురైనారని బీజేపీ ఆరోపిస్తోంది. అయితే బెంగళూరు నగరంలో ఇప్పటి వరకు బీజేపీకి చెందిన ఇద్దరు మహిళా కార్పొరేటర్ల భర్తలను పట్టపగలు అతి దారుణంగా హత్య చేశారు.