IPL 2021 Suspended Indefinitely: బీసీసీఐ కీలక ప్రకటన: మ్యాచులన్నీ క్లోజ్: కోవిడ్ సెంటర్లుగా స్టేడియాలు
ముంబై: దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రాణాలను తోడేస్తోన్న ప్రాణాంతక కరోనా వైరస్.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 (IPL 2021)కు కూడా ఎసరు పెట్టింది. ఇక మెగా క్రికెట్ టోర్నమెంట్ ముందుకు కొనసాగేది కష్టమే. ఏ ముహూర్తంలో 14వ ఎడిషన్ను మొదలు పెట్టారో గానీ.. అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి. కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఐపీఎల్నూ వదిలి పెట్టట్లేదు. ఒక్కొక్కరుగా క్రికెటర్లు, సపోర్టింగ్ టీమ్ వైరస్ బారిన పడుతున్నారు. క్వారంటైన్ల పాలవుతున్నారు. ఈ పరిణామాల మధ్య ఏకంగా టోర్నమెంట్ను అర్ధాంతరంగా రద్దు చేయాలనే డిమాండ్ ఊపందుకుంటోంది.
దీన్ని దృష్టిలో ఉంచుకుని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCC)) కీలక ప్రకటన చేసింది. ఐపీఎల్ 2021 సీజన్ను సస్పెండ్ చేసినట్లు ప్రకటించింది. ఈ మేరకు బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ఓ ప్రకటన విడుదల చేశారు. క్రికెటర్ల సంక్షేమానికి తాము ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ఈ సీజన్ టోర్నమెంట్ను మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తారనే విషయాన్ని నిర్ధారించట్లేదు. కరోనా సంక్షొభం ముగిసిన తరువాత.. దేశంలో సాధారణ పరిస్థితులు ఏర్పడినప్పుడే ఈ టోర్నమెంట్ను నిర్వహించే అవకాశం ఉన్నట్లు ప్రాథమికంగా అంచనాలు వెలువడుతున్నాయి.
ఐపీఎల్ టోర్నమెంట్ను వాయిదా వేయాలంటూ బోంబే హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం (పిల్) దాఖలైంది. క్రికెటర్ల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఐపీఎల్ 2021 టోర్నమెంట్ను తక్షణమే రద్దు చేయడం లేదా వాయిదా వేయించేలా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డుకు ఆదేశాలను జారీ చేయాలని కోరుతూ పిల్ దాఖలు చేశారు. బోంబే హైకోర్టు దీన్ని విచారణకు స్వీకరించింది. తదుపరి విచారణను గురువారం నాటికి వాయిదా వేసింది. ఐపీఎల్ 2021 సీజన్ భవిష్యత్తు ఎలా ఉండోబోతందనేది ఇక బోంబే హైకోర్టు చేతుల్లో ఉంది. పిల్ దాఖలైన కొద్దిసేపటికే బీసీసీఐ తన నిర్ణయాన్ని ప్రకటించింది.
టీమిండియా మాజీ కేప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యాన్ని వహిస్తోన్న చెన్నై సూపర్ కింగ్స్లో తాజాగా కరోనా వైరస్ కలకలం చెలరేగింది. ఆ జట్టు బౌలింగ్ కోచ్ లక్ష్మీపతి బాలాజీ కరోనా బారిన పడ్డారు. ఆయనకు నిర్వహించిన కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షల్లో పాజిటివ్గా తేలింది. సన్రైజర్స్ హైదరాబాద్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా, ఢిల్లీ కేపిటల్స్ బౌలర్ అమిత్ మిశ్రా కూడా కరోనా వైరస్ బారిన పడ్డారు. ఇలా ఒక్కొక్క ఆటగాడు, సపోర్టింగ్ టీమ్కు కరోనా మహమ్మారి సోకుతుండటంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. తరువాతి షెడ్యూల్ను త్వరలో ప్రకటిస్తామని తెలిపింది.