బియాస్ ట్రాజెడీ: రామన్న విజ్ఞప్తి, వీరభద్ర తోసివేత
సిమ్లా: బియాస్ నది ప్రవాహంలో కొట్టుకుపోయిన 24 మంది విద్యార్థుల స్మారకాన్ని సంఘటనా స్థలంలో నిర్మించాలనే తెలంగాణ అటవీ శాఖ మంత్రి విజ్ఢప్తిని హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ తోసిపుచ్చారు. జూన్ 8వ తేదీన 24 మంది హైదరాబాద్ విద్యార్థులు బియాస్ నదిలో గల్లంతైన విషయం తెలిసిందే.
కావాలంటే ఫలకాన్ని ఉంచగలమని వీరభద్ర సింగ్ మంగళవారంనాడు చెప్పారు. గల్లంతైన విద్యార్థుల గాలింపు చర్యలను పాండో డ్యామ్ వద్ద పర్యవేక్షిస్తున్న మంత్రి జోగు రామన్న విద్యార్థుల స్మారకాన్ని ఇక్కడ నిర్మించాలని, అందుకు తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుందని చెప్పారు.
జరిగింది దారుణమేనని, అయితే గతంలో కూడా ప్రమాదాల జరిగాయని, ఎన్నో రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయని, ప్రతి సంఘటనకూ స్మారకాలను నిర్మించలేమని, కావాలంటే ఫలకం పెట్టడానికి అంగీకరిస్తామని వీరభద్ర సింగ్ అన్నారు.
గల్లంతైన విద్యార్థుల కోసం శక్తి మించి పనిచేశామని, 800 మంది గాలింపు కార్యక్రమంలో పాల్గొంటున్నారని, ఇప్పటి వరకు 17 శవాలు లభించాయని ఆయన చెప్పారు.