Mamata Banerjee : కేంద్రానికి మమత కొత్త వార్నింగ్- బాకీలు చెల్లించకపోతే జీఎస్టీ ఆపేస్తాం..
కేంద్రానికి, పశ్చిమబెంగాల్ ప్రభుత్వానికీ మధ్య వార్ మరింత ముదిరింది. ఇప్పటికే పలు విషయాల్లో కేంద్రంతో విభేదిస్తున్న తృణమూల్ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇవాళ కేంద్రానికి మరో సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. తృణమూల్ ప్రభుత్వం ఉందన్న కారణంతో బెంగాల్ కు ఇవ్వాల్సిన నిధుల్ని కేంద్రం ఇవ్వకుండా పెండింగ్ లో పెట్టడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.
కేంద్రం నుంచి తమకు రావాల్సిన పెండింగ్ నిధుల్ని తక్షణం విడుదల చేయాలని, లేకపోతే రాష్ట్రం నుంచి కేంద్రానికి చెల్లించాల్సిన జీఎస్టీ వసూళ్ల షేర్ ను నిలిపేస్తానని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇవాళ హెచ్చరించారు. ఇవాళ రాష్ట్రంలోని జార్ఘ్రామ్ జిల్లాలో పర్యటించిన మమత.. అక్కడ భగవాన్ బిర్సాముండా జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం కేంద్రానికి అక్కడి నుంచే హెచ్చరికలు పంపారు. రాష్ట్రానికి చెల్లించాల్సిన నిధులు వెంటనే విడుదల చేయాలని, లేకపోతే అధికారం నుంచి తప్పుకోవాలంటూ మమత చేసిన హెచ్చరిక సంచలనం రేపింది.
అలాగే ఉపాధి హామీ పథకం నిధుల బకాయిల్ని కేంద్రం విడుదల చేయడం లేదని, దీనికి నిరసనగా గిరిజనులంతా రోడ్లపైకి రావాలని మమతా బెనర్జీ పిలుపునిచ్చారు. ఉపాధి హామీ నిధుల్ని కూడా అడుక్కోవాల్సి వస్తోందని మమత ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిధులు విడుదల చేయకపోతే మాత్రం అధికారం నుంచి తప్పుకోవాలని, లేదంటే తానే జీఎస్టీవసూళ్లు నిలిపేస్తామని కేంద్రానికి మమత హెచ్చరికలు జారీ చేశారు. దీంతో ఈ వ్యవహారం బెంగాల్, కేంద్రం మధ్య మరో చిచ్చుకు దారి తీసేలా కనిపిస్తోంది.