మధ్యాహ్న భోజనంలో ఘుమఘుమలాడే చికెన్- మెనూ.. మరింత నోరూరించేలా
కోల్కత: లక్షలాది మంది పేద, మధ్య తరగతి విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం అందజేస్తోన్న మధ్యాహ్న భోజనం ఇక మరింత నోరూరించబోతోంది. మరింత మంది విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల వైపు ఆకర్షితులు అయ్యేలా చేయడానికి, మధ్యలో బడి మానివేయడాన్ని నివారించడానికి మధ్యాహ్న భోజనం మెనూలో మరిన్ని కొత్త ఆహార పదార్థాలు వచ్చి చేరబోతోన్నాయి. పౌష్టికాహారాన్ని అందించడంలో భాగంగా కొత్త నిర్ణయాలను వెలువడుతున్నాయి.
మధ్యాహ్న భోజనంలో చికెన్..
మధ్యాహ్న భోజనంలో చికెన్ ను వడ్డించాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పుడున్న మెనూలో పౌష్టికాహారాన్ని చేర్చింది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఈ నెల 23వ తేదీ నుంచి కొత్త మెనూ అమలులోకి రానుంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న ప్రధానిమంత్రి- పోషణ్ పథకంలో కొత్తగా చికెన్, గుడ్లు, సీజనల్ ఫ్రూట్స్ ను చేర్చినట్లు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం వెల్లడించింది.
నాలుగు నెలల పాటు..
దీని కోసం పాఠశాల విద్యపై 371,60,78,400 రూపాయలను అదనంగా ఖర్చు చేయనుంది. ఒక్కో విద్యార్థిపై ఇప్పుడు ఖర్చు పెడుతోన్న మొత్తానికి అదనంగా మరో 20 రూపాయలను జోడించింది. కొత్త మెనూను నాలుగు నెలల పాటు ప్రయోగాత్మకంగా అమలు చేయనుంది ముఖ్యమంత్రి మమత బెనర్జీ సారథ్యంలో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ తరువాత అప్పటి పరిస్థితులను బట్టి దీన్ని కొనసాగించడమా? లేక మరిన్ని మెరుగైన సవరణలు చేయడమా? అనే విషయంపై నిర్ణయం తీసుకుంటుంది.
వెజ్ తో పాటు..
ప్రధానమంత్రి పోషణ్ పథకం కింద అదనపు పౌష్టికాహారాన్ని లక్షలాదిమంది విద్యార్థులకు అందించడంలో భాగంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుత మధ్యాహ్న భోజనంలో బియ్యం, బంగాళదుంపలు, సోయాబీన్ ను అందిస్తోన్నామని, దీనితో పాటు ఈ నెల 23వ తేదీ నుంచి గుడ్లు, చికెన్, సీజనల్ ఫ్రూట్లను వారానికోసారి అందించనున్నట్లు నోటిఫికేషన్ లో తెలిపింది. ఏ సీజన్ లో దొరికే ఆ సీజన్ పండ్లను మధ్యాహ్న భోజనం కింద సరఫరా చేస్తామని వివరించింది.
ఎలక్షన్ స్టంట్ గా..
మమత బెనర్జీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం- రాజకీయ రంగును పులుముకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. పశ్చిమ బెంగాల్ లో త్వరలో పంచాయతీ ఎన్నికలు జరుగనున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకునే మమత బెనర్జీ- మధ్యాహ్న భోజనంలో మార్పులు చేర్పులు చేసిందంటూ ప్రతిపక్ష భారతీయ జనత పార్టీ విమర్శలు గుప్పిస్తోంది. ఇది పూర్తిగా ఎన్నికల స్టంట్ గా అభివర్ణించింది. తన స్వార్థ రాజకీయాల కోసం విద్యార్థుల ప్రయోజనాలను ఎరగా వేసిందంటూ మండిపడుతోంది.
కేంద్రం వాటా..
మధ్యాహ్న భోజన పథకం దేశవ్యాప్తంగా అమలవుతోన్న విషయం తెలిసిందే. ఒక్కో రాష్ట్రం ఒక్కోలా ఈ పథకాన్ని కొనసాగిస్తోన్నాయి. ఏపీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్యాహ్న భోజనం కింద ఒక్కో రోజు ఒక్కో మెనూతో విద్యార్థులకు ఆమారాన్ని అందిస్తోన్న విషయం తెలిసింది.
కేంద్రం- రాష్ట్రం వాటా..
ఏపీలో ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం కింద సోమవారం- అన్నం, పప్పు చారు, కోడిగుడ్డు కర్రీ, చిక్కి, మంగళవారం- పులిహోర, టొమాటో పప్పు, ఉడికించిన గుడ్డు, బుధవారం- కూరగాయలతో అన్నం, ఆలూ కుర్మా, ఉడికించిన గుడ్డు, చిక్కి, గురువారం- కిచిడీ, టొమాటో చట్నీ, ఉడికించిన గుడ్డు, శుక్రవారం- అన్నం, ఆకుకూర పప్పు, ఉడికించిన గుడ్డు, చిక్కి, శనివారం- అన్నం, సాంబారు, స్వీట్ పొంగలి సరఫరా చేస్తోంది. మధ్యాహ్న భోజనం కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో నిధులను వ్యయం చేస్తోన్నాయి.