మోదీ ఎన్నికల సభ రద్దు వట్టిదే -వర్చువల్ ప్లాన్ -బెంగాల్లో రోడ్ షోలు, బైక్ ర్యాలీల నిషేధించిన ఈసీ
దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంటే ప్రధానికి ఎన్నికల ప్రచారసభలే ప్రధానమా? అంటూ ప్రతిపక్షాలు, ప్రజల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో మోదీ తన బెంగాల్ ఎన్నికల ప్రచార పర్యటనను రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించారు. కరోనా పరిస్థితిపై శుక్రవారం అత్యున్నత స్థాయి సమీక్ష ఉన్నందున బెంగాల్ వెళ్లడం లేదని మోదీ స్వయంగా ట్వీట్ చేశారు. అయితే, మనిషి వెళ్లనప్పటికీ, బెంగాల్ లో మోదీ సభ మాత్రం యధావిధిగా జరుగనుంది. వర్చువల్ విధానంలో ప్రధాని మోదీ ప్రసంగం చేయనున్నారు. మరోవైపు ఈసీ సైతం బెంగాల్ లో ప్రచారాలపై తీవ్ర ఆంక్షలు విధించింది..
పశ్చిమ బెంగాల్ లో రోడ్ షోలను, బైక్ ర్యాలీలను నిషేధిస్తున్నట్టు ఎన్నికల కమిషన్ గురువారం ప్రకటించింది. దేశంలో సెకండ్ కోవిడ్ ప్రబలంగా ఉండటం, బెంగాల్ లో రోజువారీ కేసులు, మరణాలు రికార్డు స్థాయికి చేరిన నేపథ్యంలో జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ నిర్ణయాలు తీసుకున్నట్టు తెలిపింది. బెంగాల్ లో గురువారంతో ఆరో దశ పోలింగ్ ముగియగా, చివరి రెండు దశల ఎన్నికలు ఈ నెల 26 , 29 తేదీల్లో జరగాల్సి ఉన్నాయి. అయితే ఆ రెండు విడతల్లో ప్రచారాలపై ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది..
పాదయాత్రలు, రోడ్ షో లు, సైకిల్, బైక్ ర్యాలీలను తక్షణమే బ్యాన్ చేస్తున్నామని ఈసీ వెల్లడించింది. రాజ్యాంగంలోని 324 అధికరణం కింద ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. అలాగే ఏ ప్రచార సభకైనా 500 మందికి మించి అనుమతించేది లేదని కూడా స్పష్టం చేసింది. ర్యాలీల వంటివాటికీ ఇదివరకే అనుమతి ఉన్నా ఆ అనుమతి రద్దయినట్టే భావించాలని ఈసీ సూచించింది. జనం పరిమిత సంఖ్యలో ఉండేలా చూడాలి.. పలురాజకీయ పార్టీలు, అభ్యర్థులు కోవిడ్ రూల్స్ ని అతిక్రమిస్తున్నారు అని ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు..
కరోనా విలయం: సుప్రీం సంచలనం -దేశంలో ఎమర్జెన్సీ -మోదీ సర్కారుకు ప్రణాళిక ఉందా? పూర్తి లాక్డౌన్?
కోవిడ్పై అత్యున్నత స్థాయి సమావేశం కారణంగా ప్రధాని మోదీ బెంగాల్టూర్ రద్దైన విషయం తెలిసిందే. అయితే ఎన్నికల సమయం కావడంతో రేపటి సభను 'వర్చువల్ సభ' గా నిర్వహిస్తున్నారు. ప్రధాని మోదీ ఈ సభనుద్దేశించి వర్చువల్గా ప్రసంగించనున్నారు. షెడ్యూల్ ప్రకారం ప్రధాని మోదీ శుక్రవారం నాలుగు సభల్లో పాల్గొనాల్సి ఉంది. బెంగాల్ బీజేపీ దాదాపుగా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసింది. మోదీ వర్చువల్గా బెంగాల్ సభలనుద్దేశించి ప్రసంగిస్తారు.