బీజేపీలో చేరిన సినీ నటి పాయల్ సర్కార్: బెంగాల్లో టీఎంసీతో పోటాపోటీగా..
కోల్కతా: పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీలో చేరికలు కొనసాగుతున్నాయి. తాజాగా, బెంగాలీ నటి పాయల్ సర్కార్ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ సమక్షంలో గురువారం ఆ పార్టీలో చేరారు.
ఎన్నికల నేపథ్యంలో బీజేపీ, అధికార టీఎంసీ పార్టీలో పోటాపోటీగా సినీతారలను తమ పార్టీలోకి చేర్చుకుంటుండటం గమనార్హం. ఇప్పటికే పలువురు సినీ నటులు ఈ రెండు పార్టీల్లో చేరారు. వారం రోజుల క్రితం బెంగాలీ నటుడు యాశ్ దాస్గుప్తా బీజేపీలో చేరారు. బీజేపీ నేతలు కైలాశ్ విజయవర్గీయ, ముకుల్ రాయ్ సమక్షంలో ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.

దాస్ గుప్తాకు బీజేపీ సభ్యత్వాన్ని విజయవర్గీయ ఈ సందర్భంగా అందజేశారు. దాస్గుప్తాతోపాటు మరికొందరు నటులు కూడా బీజేపీలో చేరారు. అశోక్ భద్ర, మల్లికా బందోపాధ్యాయ్, పాపియా అధికారి, సౌమిలి ఘోష్ బిస్వాస్, త్రమిల భట్టాచార్య బీజేపీ కండువా కప్పుకున్నారు.
ఇక క్రికెటర్ మనోజ్ తివారీ, మరో ముగ్గురు బెంగాలీ నటులు రాజ్ చక్రబర్తి, కాంచన ముల్లిక్, సయోని ఘోష్ టీఎంసీలో చేరారు. బెంగాల్ రాష్ట్రంలో ఏప్రిల్-మే నెలల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉండటంతో త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్ కూడా వెలువడనుంది.
ఎన్నికల ప్రచారంలో అధికార టీఎంసీ, బీజేపీలు పోటాపోటీగా దూసుకెళుతున్నాయి. టీఎంసీ నుంచి పలువురు కీలక నేతలు కూడా బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. కాగా, 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలోని 42 పార్లమెంటు స్థానాలకు గానూ 18 స్థానాలను దక్కించుకుని బీజేపీ సత్తా చాటింది. అధికార టీఎంసీని గద్దె దించుతామని బీజేపీ నేతలు తేల్చి చెబుతున్నారు.
West Bengal: Actor Payel Sarkar joins BJP, in Kolkata. State party chief Dilip Ghosh and national president JP Nadda also present. pic.twitter.com/dmzMLGpZoW
— ANI (@ANI) February 25, 2021
ఇప్పటికే హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా లాంటి కీలక నేతలు రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం విస్తృతంగా నిర్వహిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ కూడా బెంగాల్ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 200 స్థానాలకుపైగా కైవసం చేసుకుంటుందని ఆ పార్టీ నేతలు చెబుతుండగా, డబుల్ డిజిట్ కూడా దాటలేరంటూ టీఎంసీ ఎదురుదాడి చేస్తోంది.












Click it and Unblock the Notifications