బీచ్ లో నగలు లూటీ: పట్టించిన దొంగ బంగారం
మంగళూరు: మంగళూరులోని బీచ్ లో పార్కింగ్ చేసి ఉన్న కార్ల అద్దాలు పగలగొట్టి బంగారు నగలు లూటీ చేసి జల్సాలు చేస్తున్న వ్యక్తిని బెంగళూరు సీసీబీ పోలీసులు అరెస్టు చేశారు. బెంగళూరులోని సుంకదకట్టలో నివాసం ఉంటున్న వేణుగోపాల్ అలియాస్ వేణు (26) అనే వ్యక్తిని అరెస్టు చేశారు.
వేణుగోపాల్ నుండి రూ. 11 లక్షల విలువైన బంగారు నగలు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు చెప్పారు. ఇతని సొంత ఊరు హిరయాపట్టణ. బెంగళూరు చేరుకుని సుంకదకట్టలో నివాసం ఉంటు కూలి పని చేస్తున్నాడు.
2015 జూన్ 7వ తేదిన బెంగళూరులో హొం గార్డుగా పని చేస్తున్నలక్ష్మి అనే మహిళ స్నేహితులతో కలిసి మంగళూరులోని పెణంబూరు బీచ్ దగ్గరకు వెళ్లారు. తరువాత క్వాలిస్ వాహనంలో బంగారు నగలు పెట్టి మధ్యాహ్నం బీచ్ లో స్నానం చెయ్యడానికి వెళ్లారు.
ఆ రోజు వేణు బీచ్ దగ్గరకు వెళ్లాడు. విషయం గుర్తించిన వేణు కారు అద్దాలు పగలగొట్టి బంగారు నగలు లూటీ చేసి బెంగళూరు వచ్చాడు. తరువాత తన స్నేహితురాలి సహాయంతో వివిధ చోట్ల అర్దం బంగారు నగలు కుదవ పెట్టి నగదు తీసుకుని జల్సాలు చేశారు. మిగిలిన బంగారు నగలు వేణు స్నేహితురాలు వేసుకుని తిరగడం మొదలు పెట్టింది.
విషయం గుర్తించిన స్థానికులకు వీరి మీద అనుమానం వచ్చింది. ఒక్క సారిగా బంగారు నగలు ఎలా వచ్చాయి, విచ్చలవిడిగా నగదు ఎలా ఖర్చు పెడుతున్నారు, చైన్ స్నాచింగ్ లు చేస్తున్నారా అనే అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వేణును అదుపులోకి తీసుకుని విచారణ చెయ్యగా అసలు విషయం వెలుగు చూసింది.