వ్యాపారంలో నష్టం: టెక్కి కిడ్నాప్, అరెస్టు
బెంగళూరు: గార్మెంట్స్ వ్యాపారంలో నష్టం రావడంతో ఓ టెక్కిని కిడ్నాప్ చేసి రూ. 20 లక్షలు డిమాండ్ చేసిన నలుగురు నిందితులను బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. కిడ్నాప్ చేసిన రెండు రోజులకే పోలీసులకు చిక్కి కటకటాలపాలైనారు.
బెంగళూరు నగరంలోని హెచ్ఎస్ఆర్ లేఔట్ లో 30 సంవత్సరాల సాఫ్ట్ వేర్ ఇంజనీరు నివాసం ఉంటున్నాడు. ఇతను గత 10 సంవత్సరాల నుంచి హెచ్ఎస్ఆర్ లేఔట్ లోనే ఉంటున్నాడు. ఎలక్ట్రానిక్ సిటిలో ఇతను ఉద్యోగం చేస్తున్నాడు.
కుమార్, శంకర్, కవిదరన్, మోహన్ అనే నలుగురు తమిళనాడు నుంచి బెంగళూరు వచ్చి గార్మెంట్స్ వ్యాపారం చేశారు. వ్యాపారంలో నష్టం వచ్చింది. చేసిన అప్పులు తీర్చడానికి కిడ్నాప్ లు చెయ్యాలని ప్లాన్ వేశారు.
బుధవారం సాయంత్రం సాఫ్ట్ వేర్ ఇంజనీరు ఉద్యోగం ముగించుకుని కారులో ఇంటికి బయలుదేరాడు. అతనిని ఈ నలుగురు రెండు బైక్ లలో వెంబడించారు. హెచ్ఎస్ఆర్ లేఔట్ సమీపంలోని నిర్జనప్రదేశంలో బైక్ తో అతని కారును ఢీకొన్నారు.
తరువాత టెక్కితో గొడవ పెట్టుకుని అతని కారులోనే కిడ్నాప్ చేసి తమిళనాడులోని క్రిష్ణగిరికి తీసుకు వెళ్లారు. తరువాత టెక్కి భార్యకు ఫోన్ చేసి రూ. 20 లక్షలు ఇవ్వాలని, లేదంటే నీ భర్తను చంపేస్తామని బెదిరించారు.
బాధితురాలు హెచ్ఎస్ఆర్ లేఔట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. డీసీపీ రోహిణి కటౌచ్ సెపట్ ఐదు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేయించారు. కిడ్నాపర్లు తమిళనాడులో తలదాచుకున్నారని గుర్తించి అరెస్టు చేశారు. టెక్కిని కుటుంబ సభ్యులకు అప్పగించామని డీసీపీ రోహిణి తెలిపారు.