బెంగళూరు గ్యాంగ్ రేప్-సీన్ రీకన్స్ట్రక్షన్-ఇద్దరు నిందితులకు బుల్లెట్లు దింపిన పోలీసులు-ఘటనకు అదే కారణం?
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బెంగళూరు గ్యాంగ్ రేప్ కేసులో పోలీసులు శుక్రవారం(మే 28) సీన్ రీకన్స్ట్రక్షన్ చేపట్టారు. ఇందులో భాగంగా ఆరుగురు నిందితులను స్పాట్కు తీసుకెళ్లగా ఇద్దరు నిందితులు తప్పించుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు వారిపై కాల్పులు జరపాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఇద్దరు నిందితుల కాళ్లలో బుల్లెట్లు దిగాయి. ప్రస్తుతం ఆ ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తూర్పు బెంగళూరు డీసీపీ శరణప్ప ఈ వివరాలు వెల్లడించారు.
ఆర్థికపరమైన విభేదాలే కారణం...
సోషల్ మీడియాలో వెలుగుచూసిన గ్యాంగ్ రేప్ వీడియో ఆధారంగా ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసి వారిపై కేసులు నమోదు చేసినట్లు డీసీపీ శరణప్ప తెలిపారు. విచారణలో భాగంగా సీన్ రీకన్స్ట్రక్షన్ చేసేందుకు నిందితులను స్పాట్కు తీసుకెళ్లగా ఇద్దరు నిందితులు తప్పించుకునే ప్రయత్నం చేసినట్లు చెప్పారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో వారిపై కాల్పులు జరపాల్సి వచ్చిందన్నారు. ఇప్పటివరకూ నిందితుల నుంచి సేకరించిన వివరాల మేరకు... బాధితురాలు,నిందితులు అంతా ఒకే వయసు వారిగా గుర్తించామన్నారు.ఆర్థికపరమైన విభేదాలే యువతిపై గ్యాంగ్రేప్కి దారితీసినట్లు చెప్పారు.
అందుకు నిరాకరించడంతో...
నిందితులు తాము ఉంటున్న అద్దె ఇంట్లోనే వ్యభిచార దందా నిర్వహిస్తున్నట్లు గుర్తించామని పోలీసులు వెల్లడించారు. కొద్దిరోజుల క్రితం ఆ బాధితురాలు ఆ గ్యాంగ్ వద్ద నుంచి కొంత డబ్బుతో పారిపోయిందన్నారు. ఆ గ్యాంగ్లో కీలక సూత్రధారి అయిన వ్యక్తి ఆమె ఆచూకీ కనిపెట్టి వెనక్కి తీసుకొచ్చాడని చెప్పారు. ఎత్తుకెళ్లిన డబ్బు తిరిగి ఇచ్చేందుకు బాధితురాలు నిరాకరించడంతో ఆ గ్యాంగ్ ఆమెపై దాడికి పాల్పడిందన్నారు. ఇదే క్రమంలో ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని చెప్పారు. 22 ఏళ్ల బాధితురాలు,ఆమెపై అత్యాచారం చేసిన నిందితులు అంతా బంగ్లాదేశ్కు చెందినవారిగా భావిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. వీరంతా అక్రమంగా భారత్లోకి ప్రవేశించారని పేర్కొన్నారు.
ఆచూకీ తెలిశాక మెజిస్ట్రేట్ ముందుకు...
ప్రస్తుతం ఆ యువతి వేరే రాష్ట్రంలో ఉన్నట్లు గుర్తించామని... ఆమె ఆచూకీ కనుగొనేందుకు పోలీస్ టీమ్స్ ముమ్మరంగా గాలిస్తున్నాయని తెలిపారు. బాధితురాలి ఆచూకీ తెలిశాక ఆమె వాంగ్మూలం రికార్డు చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తామని స్పష్టం చేశారు. 22 ఏళ్ల ఆ యువతిపై నిందితులు అత్యంత పాశవికంగా అత్యాచారానికి పాల్పడిన సంగతి తెలిసిందే. నిందితుల్లో ఇద్దరు యువతులు కూడా ఉండటం గమనార్హం. బాధితురాలి మర్మాంగాల్లో బీర్ బాటిల్ జొప్పించి ఆమెను చిత్రహింసలకు గురిచేశారు. దీనికి సంబంధించిన వీడియో తొలుత అసోం,బెంగాల్,ఈశాన్య రాష్ట్రాల్లో వైరల్గా మారింది. దీంతో అక్కడి పోలీసులు అప్రమత్తమై దీని గురించి ఆరా తీశారు. అది బెంగళూరులో జరిగిన ఘటనగా గుర్తించి అక్కడి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
రామమూర్తి నగర్లో నిందితులపై కేసు
అసోం పోలీసులు ఇచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన బెంగళూరు పోలీసులు కొద్ది గంటల వ్యవధిలోనే నిందితులను అరెస్ట్ చేశారు. గ్యాంగ్ రేప్ వీడియో మొదట ఈశాన్య రాష్ట్రాల్లో వైరల్గా మారడంతో బాధితురాలు అసోం రాష్ట్రానికి చెందిన యువతిగా ప్రచారం జరిగింది. కానీ పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం బాధితురాలు సహా నిందితులంతా బంగ్లాదేశ్కి చెందినవారని తేలింది. బెంగళూరులోని రామమూర్తి నగర్ పోలీస్ స్టేషన్లో నిందితులపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు.
Recommended Video