బెంగళూరు ఐటీ దాడుల షాక్: రూ.153 కోట్ల అక్రమాస్తుల గుర్తింపు
ఐటీ అధికారులు బెంగళూరులో సోదాలు నిర్వహించారు. మొత్తం రూ.153 కోట్ల విలువ గల నగదు, బంగారం, కార్లు స్వాధీనం చేసుకున్నారు.
బెంగళూరు: ఆదాయపన్ను శాఖ అధికారులు బెంగళూరులో సోదాలు నిర్వహించి పెద్ద ఎత్తున కొత్త కరెన్సీ నోట్లు, బంగారం, లగ్జరీ కారును స్వాధీనం చేసుకుంటున్నారు. ఈ విషయం కర్నాటకలో కలకలం రేపుతోన్న విషయం తెలిసిందే.
ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్న దాంట్లో రూ.6 కోట్లు నగదు ఉంది. ఇందులో కొత్త రూ.2000 నోట్లు రూ.5.7 కోట్లు ఉన్నాయి. రూ.70 లక్షలు పాత కరెన్సీ నోట్లు ఉన్నాయి. అంటే రద్దయిన రూ.500, రూ.1000 నోట్లు ఉన్నాయి.
బెంగళూరులో ఐటీ సోదాలు: రూ.5 కోట్ల కొత్త కరెన్సీ, కిలోల కొద్ది బంగారం సీజ్
అందులో 9 కిలోల బంగారు ఆభరణాలు, అలాగే 7 కిలోల బంగారం గుర్తించారు. వీటి విలువ రూ.5 కోట్ల వరకు ఉంటుందని గుర్తించారు. గత మూడు రోజులుగా ఆదాయ పన్ను శాఖ అధికారులు బెంగళూరులో సోదాలు నిర్వహిస్తున్నారు. వీరు పెద్ద మొత్తంలో నగదు, బంగారం గుర్తిస్తున్నారు.
ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు, అలాగే మరో ఇద్దరు కాంట్రాక్టర్ల ఇళ్ల పైన ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో ఐటీ అధికారులు మొత్తం రూ.152 కోట్ల లెక్కలోకి రాని ఆస్తులు గుర్తించినట్లుగా తెలుస్తోంది. సోదాల విషయమై ఐటీ అధికారులు మాట్లాడుతూ.. విచారణ కొనసాగుతోందని చెప్పారు. ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు, ఇద్దరు కాంట్రాక్టర్ల వద్ద పెద్ద మొత్తంలో నగదు, బంగారం, కార్లు లభ్యమయ్యాయి.