ప్రభుత్వ లాంచనాలతో ఆజాతశత్రువు అంతిమ వీడ్కోలు, తరలి వచ్చిన నాయకులు!
బెంగళూరు: కేంద్ర మంత్రి అనంత్ కుమార్ కు మంగళవారం బెంగళూరులో ప్రభుత్వ లాంచనాలతో అంతిమ వీడ్కొలు పలికారు. పార్టీలకు అతీతంగా కర్ణాటకతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన నాయకులు అనంత్ కుమార్ పార్థీవదేహానికి నివాళులు అర్పించారు.
మాజీ ఉప ప్రధాని ఎల్.కే. అద్వాణి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, సదానందగౌడ, ధర్మేంద్ర ప్రధాన్, రవిశంకర్ ప్రసాద్, హర్షవర్దన్, పీయుష్ గోయల్, కర్ణాటక మాజీ మంత్రి బీఎస్. యడ్యూరప్ప, బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు అనంత్ కుమార్ కు నివాళులు అర్పించారు.
కర్ణాటక ప్రభుత్వం తరపున కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మంత్రి డీకే. శివకుమార్, కేపీసీసీ అధ్యక్షుడు దినేష్ గుండూరావ్ తదితరులు హాజరైనారు. బసవనగుడి నేషనల్ కాలేజ్ మైదానం నుంచి ఊరేగింపుగా చామరాజపేట హిందూ స్మశానవాటికకు అనంత్ కుమార్ పార్థీవదేహాన్ని తీసుకెళ్లారు.
అనంత్ కుమార్ కు ఇద్దరు కుమార్తెలు ఉండటం, కుమారులు లేకపోవడంతో అంత్యక్రియలు ఎవ్వరు చేస్తారు అని చర్చ జరిగింది. చివరికి అనంత్ కుమార్ సోదరుడు నందకుమార్ హిందూ సాంప్రధాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. ప్రభుత్వ లాంచనాలతో అనంత్ కుమార్ అంత్యక్రియలు జరిగాయి. అనంత్ కుమార్ అమరహే అంటూ ఆయన అభిమానులు, బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.