పంజాబ్ కొత్త "భగవాన్": కమెడియన్ బన్గయా సీఎం..ఎలా సాధ్యమైంది..?
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఎగ్జిట్ పోల్స్ అంచనాలను అందుకున్నాయి. పంజాబ్లో ఇటు బీజేపీకి అటు కాంగ్రెస్కు షాకిస్తూ కామన్ మ్యాన్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ అధికారం వైపు అడుగులు వేస్తోంది. దశాబ్దాలుగా పంజాబ్ రాజకీయాలను ఏలిన కాంగ్రెస్ శిరోమణి అకాలీదళ్ పార్టీలను కాదని అక్కడి ప్రజలు ఆప్ పార్టీ రూపంలో మార్పును కోరుకున్నారు. దీంతో ఆప్కు అధికారం కట్టబెట్టారు. ఇక ఆప్ నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థి భగవంత్ మన్ నాయకత్వాన్ని అక్కడి ప్రజలు కోరుకుంటున్నారు. 2019లో ఎంపీగా ఎన్నికైన భగవంత్ మన్ ఇప్పుడు ఆ రాష్ట్ర పగ్గాలు చేపట్టబోతున్నారు. దీంతో ఈ భగవంత్ మన్ ఏంటి, ఆయన నేపథ్యం ఏంటనేదానిపై నెటిజెన్లు విస్తృతంగా సెర్చ్ చేస్తున్నారు.

భగవంత్ మన్ ఎవరు..?
పంజాబ్కు కొత్త పార్టీ రూపంలో కొత్త నాయకుడు పగ్గాలు చేపట్టనున్నారు. అతనే భగవంత్ మన్. కామన్ మ్యాన్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి పార్లమెంటుకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఏకైక ఎంపీ భగవంత్ మన్. ఇప్పుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కాబోతున్నారు. భగవంత్ మన్ నేపథ్యం గురించి చాలామంది నెటిజెన్లు వెతుకుతున్నారు. అయితే ఇక్కడ ఓ ఇంట్రెస్టింగ్ పాయింట్ భగవంత్ మన్ గురించి బయటపడింది. ఈయన ముందుగా ఓ కామెడీ స్టార్. భగవంత్ మన్ నేపథ్యం గురించి ఒకసారి చూద్దాం.

కుటుంబ నేపథ్యం-విద్య
1973 అక్టోబర్ 17వ తేదీన భగవంత్ మన్ ఒక జాట్ సిక్కు కుటుంబంలో జన్మించారు. తండ్రి పేరు మొహిందర్ సింగ్ తల్లి పేరు హర్పాల్ కౌర్. సంగ్రూర్ జిల్లాలోని సతోజ్ గ్రామంలో భగవంత్ మన్ జన్మించారు. సునాంలోని షాహిద్ ఉధమ్ సింగ్ గవర్నమెంట్ కాలేజీ నుంచి డిగ్రీ పూర్తి చేశారు. ఆ సమయంలోనే పలు కామెడీ షోల్లో నటించేవారు. ఇంటర్ కాలేజ్ కాంపిటీషన్స్లో, యూత్ కామెడీ ఫెస్టివల్స్లో పాల్గొని రెండు గోల్డ్ మెడల్స్ సైతం సాధించారు.

కెరీర్గా కామెడీ షోలు
భగవంత్ సింగ్ మన్ భారత్ ఎదుర్కొంటున్న పలు అంశాలపై కామెడీ షోలు చేసి అవగాహన తీసుకొచ్చేవారు. ముఖ్యంగా భారత రాజకీయాలు, ఆర్థిక స్థితిగతులు, వాణిజ్యం, క్రీడారంగం ఇలా పలు అంశాలపై కామెడి రొటీన్స్ చేసేవాడు. తన మొదటి కామెడీ ఆల్బమ్ జగ్తర్ జగ్గీతో చేశాడు. వీరిద్దరూ కలిసి తొలిసారిగా టీవీ కామెడీ షో జుగ్ను కెహెందా హై అనే కార్యక్రమం చేశారు. పదేళ్ల తర్వాత ఇద్దరూ వేరయ్యారు. ఆ తర్వాత రానా రణబీర్తో భగవంత్ మన్ భాగస్వామి అయ్యాడు. వీరిద్దరూ కలిసి కొన్ని కామెడీ షోలు చేశారు.జుగ్ను మస్త్ మస్త్ అనే షోను సక్సెస్ఫుల్గా నిర్వహించారు. 2006లో జగ్గితో తిరిగి కలిసి వీరిద్దరూ కెనడా, ఇంగ్లాండ్లలో పర్యటించి వారి కామెడీ షోలతో ఆకట్టుకున్నారు. 2008లో వచ్చిన నో లైఫ్ విత్ వైఫ్ మంచి పేరు తెచ్చిపెట్టింది. స్టార్ ప్లస్లో 2008లో టెలికాస్ట్ అయిన గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ ఛాలెంజ్లో పాల్గొనడంతో ప్రేక్షకులు ఈయనకు ఫిదా అయ్యారు. దీంతో ఆయన క్రేజ్ పెరిగింది. అంతేకాదు భగవంత్ మన్ మై మా పంజాబ్ దీ అనే చిత్రంలో కూడా నటించారు. ఈ చిత్రానికి జాతీయ అవార్డు వరించింది.
Recommended Video

పొలిటికల్ కెరీర్
2011లో పీపుల్స్ పార్టీ ఆఫ్ పంజాబ్తో భగవంత్ మన్ రాజకీయ అరంగేట్రం చేశారు. 2012లో లెహ్రా నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.2014లో ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. సంగ్రూర్ లోక్సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేసి 2,11,721 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. 2017లో జలాలాబాద్ నుంచి సుఖ్బీర్ సింగ్ బాదల్ పై పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2014లో తొలిసారిగా ఎంపీ అయిన భగవంత్ మన్ ఆ తర్వాత 2019లో రెండో సారి కూడా విజయం సాధించారు. ఇప్పటికీ ఆయన ఎంపీగానే కొనసాగుతున్నారు. ఇక పంజాబ్ ఆప్ సీఎం అభ్యర్థి భగవంత్ మన్ కాబట్టి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశాక తాను ప్రాతినిథ్యం వహిస్తున్న సంగ్రూర్ లోక్సభ స్థానానికి రాజీనామా చేస్తారు.
మొత్తానికి ఒక కామెడీ స్టార్ ఉక్రెయిన్ దేశానికి అధ్యక్షుడిగా ఎలా అయ్యారో... ఇప్పుడు భగవంత్ మన్ అనే ఒకప్పటి కమెడియన్ కూడా పంజాబ్ సీఎంగా పగ్గాలు చేపట్టబోతున్నారంటూ సోషల్ మీడియాలో నెటిజెన్లు చర్చించుకుంటున్నారు.












Click it and Unblock the Notifications