భారత్ బంద్ ఎఫెక్ట్: రేపు ఆరో విడత చర్చలకు ముందే రైతులతో ఈ రోజు రాత్రి అమిత్ షా భేటీ
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా, ఆ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు రైతులు భారత్ బంద్ కు పిలుపునిచ్చిన క్రమంలో భారత్ బంద్ కొనసాగుతోంది. రైతుల భారత్ బంద్ కు దేశవ్యాప్తంగానూ, ఇతర దేశాలలోని భారతీయుల నుండి విపరీతమైన మద్దతు లభిస్తుంది. ఇప్పటికే బంద్ కు మద్దతు ప్రకటిస్తూ దేశవ్యాప్తంగా ఉన్న పలు రాజకీయ పార్టీలు రైతుల కోసం ఆందోళన బాట పట్టాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ రైతులకు మద్దతుగా ఆందోళనలు కొనసాగుతున్నాయి.
రైతుల ఆందోళనలకు చెక్ పెట్టాలని భావిస్తున్న కేంద్రం
ఇదిలా ఉంటే వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా భారీ నిరసనలను తీవ్రతరం అవుతున్న వేళ దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. వ్యవసాయ చట్టాల విషయంలో ప్రభుత్వ తీరు రద్దు చేసుకునే లాగా కనిపించడం లేదు. ఏదో విధంగా రైతులకు నచ్చజెప్పి ఆందోళనలు విరమించేలా చెయ్యాలని భావిస్తుంది. కానీ రైతులు పట్టిన పట్టు విడవటం లేదు. ఒకే మాట మీద ఉన్నారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేసి తీరాలని డిమాండ్ చేస్తున్నారు.
ఆరో రౌండ్ చర్చలు రేపు .. నేడు రైతులతో రాత్రి 7 గంటలకు అమిత్ షా భేటీ
ఇప్పటికే రైతులతో ఐదు దఫాలుగా చర్చలు జరిపిన కేంద్రం ఏమి తేల్చలేదు. రేపు మరోమారు ప్రభుత్వం ఆరవ రౌండ్ చర్చలకు ఆహ్వానిస్తుంది.దీంతో నేడు భారత్ బంద్ కొనసాగుతున్న తరుణంలో, రేపు జరగనున్న చర్చలకు ఒక రోజు ముందు హోంమంత్రి అమిత్ షా ఈ సాయంత్రం రైతులతో మాట్లాడడానికి చర్చలకు పిలిచారు. దేశవ్యాప్తంగా భారత్ బంద్ కొనసాగుతున్న వేళ ఎక్కడికక్కడ రవాణా, రైలు మార్గాలను సైతం నిలిపి వేసిన వేళ, హోంమంత్రి అమిత్ షా రైతులను చర్చల కోసం ఆహ్వానించారు.
అమిత్ షా తో మాట్లాడతామన్న రైతు సంఘం నాయకులు ..
తమకు ఫోన్ వచ్చిందని, అమిత్ షా మాట్లాడదామని పిలిచారు. మమ్మల్ని రాత్రి 7 గంటలకు రమ్మన్నారు అని రైతు నాయకుడు రాకేశ్ టికాయత్ అన్నారు. ఈ సమావేశానికి రైతుల తరపున ప్రతినిధులు హాజరవుతారని రాకేశ్ టికాయత్ స్పష్టం చేశారు.రైతులు తమ ‘దిల్లీ చలో' నిరసనను ప్రారంభించిన తర్వాత ఇప్పటి వరకు ఐదు విడతలుగా చర్చలు జరిగాయి. ఇప్పటివరకు చర్చలలో ఎటువంటి పురోగతి లేక ప్రతిష్టంభన నెలకొంది. ఇప్పటి వరకూ జరిగిన చర్చల్లో అమిత్ షా పాల్గొనలేదు.
రైతులతో మాట్లాడాలని హోంమంత్రి అమిత్ షా ప్రతిపాదిత సమావేశంపై ఆసక్తి
ఈ సమయంలో రైతులతో మాట్లాడాలని హోంమంత్రి అమిత్ షా ప్రతిపాదిత సమావేశం ఒక ముఖ్యమైన పరిణామంగా కనిపిస్తుంది. ఇది రైతుల సమస్యలను పరిష్కరించడంలో , ప్రతిష్టంభన పరిస్థితిని అధిగమించడంలో ఏ మేరకు ఉపయోగపడుతుంది అనేది వేచి చూడాలి.కానీ ఒకపక్క రైతులు వ్యవసాయ చట్టాల రద్దుకే డిమాండ్ చేస్తుండటం , మరోపక్క సర్కార్ అందుకు సిద్ధంగా లేకపోవటంతో ఈ రోజు సాయంత్రం అమిత్ షా తో రైతులు ఏమి మాట్లాడతారు. ఆయన ఏం చెప్తారు అనేది ఆసక్తికరంగా మారింది.