ఏపీతోపాటు 14 రాష్ట్రాలకు భారత్ బయోటెక్ కోవాగ్జిన్ టీకాలు: కేంద్రం కేటాయింపుల ప్రకారమే
హైదరాబాద్: దేశ వ్యాప్తంగా కరోనా వ్యాప్తి వేగంగా జరుగుతున్నవేళ కరోనా వ్యాక్సిన్ల కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో కరోనా వ్యాక్సిన్ల ఉత్పత్తిని పెంచాలని వ్యాక్సిన్ తయారీ సంస్థల(సీరమ్ ఇనిస్టిట్యూట్, భారత్ బయోటెక్ )ను కేంద్ర ప్రభుత్వం కోరింది. అవసరమైన రాష్ట్రాలకు తగినన్నీ కరోనా వ్యాక్సిన్లను అందిస్తామని తెలిపింది. రాష్ట్రాలు కూడా వ్యాక్సిన్ తయారీ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుని వ్యాక్సిన్లను కొనుగోలు చేయవచ్చని పేర్కొంది.
భారత్ బయోటెక్ కోవాగ్జిన్ టీకాలు పంపిణీ..
ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరానికి చెందిన భారత్ బయోటెక్ సంస్థ కోవాగ్జిన్ వ్యాక్సిన్లను దేశంలోని పలు రాష్ట్రాలకు సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేసింది. 14 రాష్ట్రాలు తమను సంప్రదించినట్లుగా భారత్ బయోటెక్ వెల్లడించింది. తమతో ఒప్పందం చేసుకున్న 14 రాష్ట్రాలకు కేంద్రం కేటాయింపుల మేరకు నేరుగా కోవాగ్జిన్ వ్యాక్సిన్ను సరఫరా చేస్తున్నామని భారత్ బయోటెక్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్ర ఎల్లా తెలిపారు.
14 రాష్ట్రాలకు కోవాగ్జిన్ టీకాలు... ఏపీకి చేరిన 2 లక్షల డోసులు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణతోపాటు అస్సాం, ఛత్తీస్గఢ్, గుజరాత్, జమ్మూ అండ్ కాశ్మీర్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలకు కోవాగ్జిన్ను భారత్ బయోటెక్ సరఫరా చేస్తోంది. ఇప్పటికే ఏపీకి రెండు లక్షల కోవాగ్జిన్ డోసులు హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నాయి. వాటిని అక్కడ్నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి తరలించారు. వైద్యారోగ్య శాఖ ఆదేశాల అనంతరం ఈ వ్యాక్సిన్లను ఆయా జిల్లాలకు తరలించనున్నారు.
Recommended Video
రాష్ట్రాలకు రూ. 400లకు డోసు అందిస్తున్న భారత్ బయోటెక్
మే 1న కేంద్ర ప్రభుత్వం నుంచి కేటాయింపులపై ఆదేశాలు వచ్చాయని, అదే విధంగా వ్యాక్సిన్లను రాష్ట్రాలకు అందిస్తున్నట్లు భారత్ బయోటెక్ తెలిపింది. రాష్ట్రాలకు ఇస్తున్న కరోనా వ్యాక్సిన్ డోసు ధరను రూ. 600 నుంచి రూ. 400 తగ్గించినట్లు ఇప్పటికే భారత్ బయోటెక్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, కేంద్ర ప్రభుత్వానికి వ్యాక్సిన్ డోసును రూ. 150 అందించడంపై విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. కాగా, మే 1 నుంచి 18-44ఏళ్ల వయస్కులకు కూడా వ్యాక్సిన్ వేయాలని కేంద్రం పిలుపునిచ్చింది. వ్యాక్సిన్ కొరత కారణంగా 45ఏళ్లు నిండినవారికే రాష్ట్రాలు ప్రస్తుతం వ్యాక్సిన్ అందిస్తున్నాయి. రెండో డోసు తీసుకోవాల్సిన వారికే ప్రాధాన్యత ఇస్తున్నాయి.