భారత్ బయోటెక్ కీలక ప్రకటన: కోవాగ్జిన్ బూస్టర్ ట్రయల్స్ త్వరలో ప్రారంభం
హైదరాబాద్: ఇప్పటికే కోవాగ్జిన్ వ్యాక్సిన్ను అభివృద్ధి చేసిన హైదరాబాద్ నగరానికి చెందిన భారత్ బయోటెక్ తాజాగా, మరో కీలక ప్రకటన చేసింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న టీకా రెండు డోసుల్లో ఇస్తుండగా, వాటి వల్ల ఉత్పత్తి అయ్యే యాంటీబాడీలు ఎంతకాలం ఉంటాయనేదానిపై స్పష్టత లేదు. దీంతో మూడో డోసు అంటే బూస్టర్ డోసు అవసరం ఎంతైనా ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.
ఈ నేపథ్యంలోనే భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్కు బూస్టర్ డోస్ ప్రతిపాదించింది. అంతేగాక, ఈ బూస్టర్ డోస్ క్లినికల్ ట్రయల్స్కు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీజీసీఐ) నిపుణుల కమిటీకి కొన్ని సవరణలను ప్రతిపాదించింది. వీటిపై సుదీర్ఘ సంప్రదింపుల తర్వాత 6ఎంసీజీ మోతాదులో ప్రయోగాలను కొనసాగించవచ్చని డీసీజీఐ నిపుణుల కమిటీ అనుమతిచ్చింది.
మూడో డోసు ఇచ్చిన తర్వాత ఆరు నెలలపాటు కమిటీ సిఫార్సులను పాటించాలని భారత్ బయోటెక్కు సూచించింది. ప్రయోగాల ప్రాథమిక, ద్వితీయ లక్ష్యాల వివరాలను కూడా కమిటీకి అందించాలని కోరింది. మార్చి 23వ తేదీన జరిగిన నిపుణుల కమిటీ భేటీలో బూస్టర్ డోసుకు సంబంధించిన క్లినికల్ ట్రయల్స్ నిబంధనల్లో మార్పులు, ప్రయోగాల లక్ష్యాలపై భారత్ బయోటెక్తో సుదీర్ఘంగా చర్చించింది.
కాగా, ఈ బూస్టర్ డోసు ప్రయోగాల్లో రెండో దశ క్లినికల్ ట్రయల్స్ లో పాల్గొన్న వాలంటీర్లకు రెండో డోసు తీసుకున్న ఆరు నెలల గడువు తర్వాత మూడో డోసు ఇచ్చి పరీక్షిస్తారు. కాగా, భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ టీకా 81 శాతం సమర్థత కనబరిచినట్లు తుది దశ క్లినికల్ ట్రయల్స్లో వెల్లడైంది.
సుమారు 25,800 మంది వాలంటీర్లపై నిర్వహించిన ప్రయోగాల్లో కోవాగ్జిన్ టీకా సురక్షితమని తేలినట్లు భారత్ బయోటెక్ ఇటీవలే ప్రకటించింది. అంతేగాక, ఇక కొత్తగా వెలుగుచూసిన కొత్త రకాలపైనా కోవాగ్జిన్ సమర్థంగా పనిచేస్తున్నట్లు భారత్ బయోటెక్ పేర్కొంది. కోవాగ్జిన్ టీకా సురక్షితమేనని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. కోవిషీల్డ్ తోపాటు కోవాగ్జిన్ టీకాలను మనదేశంలో వేయిస్తున్నారు.