కోవాగ్జిన్ 12ఏళ్ల పైవారికి.. కోవిషీల్డ్ 18 ఏళ్లు నిండినవారికి: డీసీజీఐ అనుమతి పత్రంలో కీలకాంశాలు
న్యూఢిల్లీ: దేశంలో రెండు కరోనా వ్యాక్సిన్లకు అత్యవసర వినియోగ అనుమతి లభించిన విషయం తెలిసిందే. డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ).. కోవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్ వినియోగానికి అనుమతించింది. కాగా, ఈ రెండు వ్యాక్సిన్లను ఏ వయస్సువారికి ఇవ్వవచ్చునో కూడా డీసీజీఐ తన అనుమతి పత్రంలో వెల్లడించింది.
Recommended Video

కోవాగ్జిన్ 12ఏళ్ల పైవారికి.. కోవిషీల్డ్ 18 ఏళ్లు నిండినవారికి
భారత్ బయోటెక్ రూపొందించిన కరోనా వ్యాక్సిన్ కోవాగ్జిన్ 12 ఏళ్ల వయస్సుకు మించినవారికి మాత్రమే ఉపయోగించాలని డీసీజీఐ స్పష్టం చేసింది. పుణెకు చెందిన సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ).. ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనికా సంస్థలతో కలిసి రూపొందించిన కరోనా వ్యాక్సిన్ కోవిషీల్డ్.. 18 ఏళ్లు నిండినవారికి మాత్రమే ఇవ్వాలని డీసీజీఐ వెల్లడించింది. కోవిషీల్డ్, కోవాగ్జిన్ వ్యాక్సిన్లకు అత్యవసర వినియోగానికి అనుమతి లభించడంతో దేశంలో త్వరలోనే భారీ ఎత్తున వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించనున్నారు.

కోవాగ్జిన్, కోవిసీల్డ్ కు డీసీజీఐ అనుమతి..
ఈ రెండు వ్యాక్సిన్లను కూడా రెండు డోసుల్లో ఇవ్వాలని డీసీజీఐ తన అనుమతి పత్రంలో స్పష్టం చేసింది. ఈ ఆదివారమే కోవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్లకు అత్యవసర వినియోగానికి డీసీజీఐ అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్(సీడీఎస్సీవో)కు సంబంధించిన
కరోనా వ్యాక్సిన్ సబ్జెక్ ఎక్స్పర్ట్ కమిటీ(ఎస్ఈసీ) ఇచ్చిన నివేదిక మేరకు డీసీజీఐ ఈ రెండు వ్యాక్సిన్లకు అత్యవర వినియోగ అనుమతి ఇచ్చింది.

కోవాగ్జిన్ అనుమతిపై ప్రశ్నలు.. డీసీజీఐ సమాధానం
అయితే, ఫేజ్-3 ట్రయల్స్ పూర్తి కాకుండానే భారత్ బయోటెక్ కు చెందిన కోవాగ్జిన్ కు అనుమతి ఇవ్వడంపై పలువురు ప్రశ్నలు లేవనెత్తిన విషయం తెలిసిందే. ఈ వాక్సిన్ కు అనుమతి ఎలా? ఎందుకు ఇచ్చారంటూ కాంగ్రెస్ నేతలు పలువురు ప్రశ్నించారు. అయితే, డీసీజీఐ మాత్రం ఈ రెండు కరోనా వ్యాక్సిన్లు సురక్షితమని భావించిన తర్వాతే తాము అనుమతి ఇచ్చినట్లు పేర్కొంది. కోవాగ్జిన్ వ్యాక్సిన్.. కరోనాను తట్టుకునేలా రోగనిరోధక శక్తిని పెంచుతుందని తెలిపింది. 110 శాతం ఈ వ్యాక్సిన్ సురక్షితమేనని స్పష్టం చేసింది.

తొలి 100 మిలియన్ల కోవిషీల్డ్ డోసులు ప్రభుత్వానికే..
ఈ నేపథ్యంలో డ్రగ్ రెగ్యూలేటర్ కూడా కోవాగ్జిన్ ఫేజ్ 1,2,3లకు సంబంధించిన క్లినికల్ ట్రయల్స్ వివరాలను అందజేయాలని భారత్ బయోటెక్ను కోరింది. ఇది ఇలావుండగా, కోవిషీల్డ్ ధరను సీరమ్ సీఈవో అదర్ పూనావాలా ఆదివారం వెల్లడించారు. ఈ వ్యాక్సిన్ ను ప్రభుత్వానికి రూ. 200, ప్రైవేటు వ్యక్తులు, సంస్థలకు రూ. 1000లకు విక్రయించనున్నట్లు తెలిపారు. తొలి 100 మిలియన్ల డోసులను ప్రభుత్వానికి రూ. 200 చొప్పున విక్రయించనున్నట్లు వెల్లడించారు.












Click it and Unblock the Notifications