వాజపేయి, బోస్లకు భారతరత్న! మిస్టరీ చేధించాలని..
న్యూఢిల్లీ: మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయి, స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్లను దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న అవార్డుతో సత్కరించాలని అనుకుంటున్నట్టు తెలుస్తోంది. హోంమంత్రిత్వ శాఖ అయిదు భారత రత్న పతకాల కోసం ఆర్డర్ ఇచ్చిందన్న వార్తలతో కేంద్రం ఈ ఏడాది ఐదుగురిని పురస్కారాలతో సత్కరించాలని అనుకుంటున్నట్టుగా ఊహాగానాలు ఊపందుకున్నాయి.
వాజపేయి, నేతాజీలతోపాటుగా బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపకుడు కాన్షీరాం, హాకీ లెజండ్ ధ్యాన్చంద్, బెనారస్ హిందూ వర్శిటీ వ్యవస్థాపకుడు మదన్ మోహన్ మాలవ్యలకు కూడా అవార్డులు ప్రకటించే అవకాశం ఉందంటున్నారు. తమ పార్టీ అగ్రనేత, మాజీ ప్రధాని వాజపేయికి భారత రత్న అవార్డు ఇవ్వాలని బీజేపీ పార్టీ చాలాకాలంగా డిమాండ్ చేస్తూ ఉంది.
ఇప్పుడు నరేంద్ర మోడీ నేతృత్వంలో బిజెపి ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి రావడంతో వాజపేయికి భారత రత్న అవార్డును ప్రకటించడం ద్వారా పార్టీలో అగ్రనేత అయిన ఆయనను సముచిత రీతిన గౌరవించాలని అనుకుంటోందని చెప్తున్నారు. ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మోడీ దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా చేయవచ్చంటున్నారు.
గత ఏడాది నవంబర్లో క్రికెటర్ సచిన్ టెండూల్కర్, ప్రముఖ శాస్తవ్రేత్త సిఎన్ఆర్ రావులకు భారత రత్న అవార్డులను ప్రకటించినప్పుడు సైతం బిజెపి ఈ అంశాన్ని లేవనెత్తింది. వాజపేయికి ఈ అవార్డు ఇవ్వాలంటూ బిజెపి సీనియర్ నాయకుడు, ఆయన ప్రభుత్వంలో ఉప ప్రధాని అయిన ఎల్కే అద్వానీ 2008లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్కు లేఖ కూడా రాశారు. అయితే యూపీఏ ప్రభుత్వం ఆయన పేరును ఎప్పుడూ పరిశీలించలేదు.
ఇక నేతాజీ విషయానికి వస్తే 1992లో అప్పటి ప్రభుత్వం ఆయనకు భారత అవార్డును ప్రకటించింది కానీ ఆ తర్వాత తలెత్తిన వివాదం కారణంగా ఆయనకు అవార్డును ప్రదానం చేయలేదు. మరణానంతరం అవార్డు ఇవ్వడాన్ని నేతాజీ కుటుంబీకులు, ఆయన అభిమానులు తీవ్రంగా వ్యతిరేకించడం ఈ వివాదానికి కారణం. చివరికి ఈ వివాదం సుప్రీంకోర్టు దాకా వెళ్లింది. సుప్రీం జోక్యంతో నేతాజీకి ఈ అవార్డును రద్దు చేస్తున్నట్టు అప్పటి ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.
అయిదు పతకాల కోసం ఆర్డర్ ఇచ్చినంత మాత్రాన అయిదుగురికి ఈ అవార్డు ఇస్తారని అర్థంకాదని హోంశాఖ వర్గాలు అంటున్నాయి. నేతాజీని ప్రభుత్వం భారత రత్న పురస్కారంతో సత్కరించనున్నట్టు పెద్ద ఎత్తున ఊహాగానాలు వస్తున్నప్పటికీ ఆయన కుటుంబీకుల్లో చాలామంది ఇప్పటికీ ఆయనకు ఈ అవార్డు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నారు. అంతేకాదు, నేతాజీకి భారత రత్న ఇవ్వడానికన్నా ముందు ఆయన అదృశ్యం వెనుక ఉన్న మిస్టరీని ఛేదించాలని డిమాండ్ చేస్తున్నారు.
1945నుంచి నేతాజీ కనిపించడం లేదని, మరణానంతరం ఆయనకు భారత రత్న అవార్డు ఇస్తున్నట్టయితే ఆయన ఎప్పుడు చనిపోయారో చెప్పాలని, అయితే ఆయన చనిపోయారనడానికి సాక్ష్యం లేదని, ఆయన అదృశ్యం వెనుక ఉన్న మిస్టరీని ఛేదించే ప్రభుత్వ ఫైళ్లను బహిరంగ పరిస్తే అదే ఆయనకు ఇచ్చే నిజమైన గౌరవమని నేతాజీ ముని మనుమడు చంద్రకుమార్ బోస్ పిటిఐతో అన్నారు. అంతేకాదు ఈ అవార్డును స్వీకరించడానికి తమ కుటుంబీకులు ఎవరు కూడా వెళ్లరని ఆయన స్పష్టం చేశారు.