కరోనా : అధికారిక లెక్క 109.. అసలు లెక్క 2567.. ఆ ఒక్క నగరంలోనే ఒక్క నెలలో రికార్డు స్థాయిలో మరణాలు
కరోనా సెకండ్ వేవ్లో దేశవ్యాప్తంగా మరణాల సంఖ్య రికార్డు స్థాయిలో పెరిగింది. దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో మొదటి వేవ్ కంటే ఎక్కువ మరణాలు నమోదవుతున్నాయి. ఒక్క భోపాల్ నగరంలోనే ఏప్రిల్ నెలలో 2వేల పైచిలుకు మంది కోవిడ్ పేషెంట్లు చనిపోయారని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం భోపాల్లో ఏప్రిల్లో సంభవించిన మరణాల సంఖ్య కేవలం 109 మాత్రమే. కానీ అక్కడి శ్మశానాలు,దహన వాటికల్లో రికార్డులను పరిశీలిస్తే 2567 మంది కోవిడ్ పేషెంట్లు చనిపోయినట్లు తేలిందని ఓ జాతీయ మీడియా కథనాన్ని ప్రచురించింది.
Recommended Video

దహన వాటికల్లో సిబ్బందిపై తీవ్ర ఒత్తిడి...
భోపాల్లో ఆరు దహన వాటికలు,నాలుగు శ్మశానాలు ఉన్నాయి. కోవిడ్ పేషెంట్ల మరణాలు ఎక్కువగా ఉండటంతో ఈ ఆరింటిపై తీవ్ర ఒత్తిడి నెలకొంది.' ఇక్కడి దహనవాటికలో ఎటుచూసినా పీపీఈ కిట్లు,గ్లవ్స్ చెల్లాచెదురుగా కనిపిస్తున్నాయి. మా సిబ్బంది పని ఒత్తిడితో సతమతమవుతున్నారు. మున్సిపల్ అధికారులు కనీసం దహన వాటికను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేస్తూ శుభ్రపరిస్తే బాగుంటుంది...' అని సుభాష్ నగర్ విశ్రామ్ ఘాట్ సిబ్బంది సోమరాజ్ సుఖ్వాణి తెలిపారు.

శ్మశానం ఫుల్...
'ఇక్కడి శ్మశానంలో ఇప్పటికే స్పేస్ లేకుండా పోయింది. కోవిడ్ మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహిస్తున్న 8 మంది సిబ్బంది అవిరామంగా పనిచేస్తున్నారు. శ్మశానికి కోవిడ్ బాధితుల మృతదేహాలు వస్తూనే ఉన్నాయి. వారంలో రెండుసార్లు జేసీబీ వచ్చి ముందుగానే గుంతలు తీసి వెళ్తుంది. ఏప్రిల్ ఒక్క నెలలోనే దాదాపు 170 నాన్ కోవిడ్ మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించాం. సాధారణ రోజుల్లో అయితే ప్రతీ నెలా 60కి మించి మృతదేహాలు రావు. నిజానికి చాలావరకు కోవిడ్ బాధితుల మరణాలను సహజ మరణాలుగా చూపిస్తున్నట్లు మాకు అనుమానం వస్తోంది.' అని జాదా కబ్రస్తాన్ ప్రెసిడెంట్ రెహాన్ గోల్డెన్ తెలిపారు.

మరణాలను దాస్తున్నారా...?
కోవిడ్ మరణాలను దాస్తున్నారన్న విమర్శలపై ఆరోగ్య శాఖ మంత్రి ప్రభురాం చౌదరి స్పందించారు. 'కోవిడ్ బాధితుల మరణాలను దాచాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదు. నిజానికి కరోనా అనుమానిత మృతదేహాలకు కూడా కోవిడ్ ప్రోటోకాల్ ప్రకారమే దహన సంస్కారాలు నిర్వహిస్తున్నాం.' అని తెలిపారు. అడిషనల్ చీఫ్ సెక్రటరీ మహమ్మద్ సులేమాన్ మాట్లాడుతూ... ప్రజలంతా వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు. ఇప్పటికీ కోవిడ్ కేర్ సెంటర్లలో కేవలం 26శాతం బెడ్లు మాత్రమే నిండాయని చెప్పారు. కాబట్టి ఎవరికైనా పాజిటివ్ అని తేలితే ఆస్పత్రికి వెళ్లి చికిత్స తీసుకోవాలన్నారు.












Click it and Unblock the Notifications