కాంగ్రెస్ కు భారీ ఎదురుదెబ్బ-ఆజాద్ కు మద్దతుగా 51 మంది జమ్మూ-కశ్మీర్ నేతల క్యూ..
కాంగ్రెస్ పార్టీ విధానాలతో విభేదిస్తూ రాజీనామా చేసి వెళ్లిపోయిన జమ్మూ, కశ్మీర్ నేత గులాం నబీ ఆజాద్ కొత్త పార్టీ స్ధాపించే ప్రయత్నాల్లో బిజీగా ఉన్నారు. కొత్తగా ప్రాంతీయ పార్టీ స్ధాపించేందుకు సిద్ధమవుతున్న ఆజాద్ కు బీజేపీ మద్దతిస్తోంది. స్ధానికంగా ఉన్న నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీని కాదని ఆజాద్ పార్టీని గెలిపించేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలను గమనించిన కాంగ్రెస్ నేతలు ఆ పార్టీని వీడేందుకు సిద్దమవుతున్నారు. వీరంతా ఆజాద్ కొత్త పార్టీలో చేరేందుకు రంగం సిద్ధంచేసుకుంటున్నారు.
ఇప్పటికే గులాం నబీ ఆజాద్ రాజీనామాతో కాంగ్రెస్ తీవ్ర ఆందోళనకు గురవుతున్న తరుణంలో 51 మంది నేతలు రాజీనామా చేసి ఆజాద్ కొత్త పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పరిస్ధితి మరింత దిగజారేలా కనిపిస్తోంది. ఆజాద్ రాజీనామా చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు 64 మంది నేతలు పార్టీని వీడారు.
స్ధానిక నాయకులలో గులాం నబీ ఆజాద్కు మద్దతుగా ఇవాళ పార్టీకి రాజీనామా చేసిన వారిలో జమ్మూ కాశ్మీర్ మాజీ ఉప ముఖ్యమంత్రి తారా చంద్ కూడా ఉన్నారు. ఆయన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిసి రాజీనామా లేఖను సమర్పించారు.
తారా చంద్, మాజీ మంత్రులు అబ్దుల్ మజిద్ వానీ, మనోహర్ లాల్ శర్మ, ఘరు రామ్, మాజీ ఎమ్మెల్యే బల్వాన్ సింగ్లతో సహా పలువురు పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో సహా రాజీనామా చేస్తున్నట్లు విలేకరుల సమావేశంలో ప్రకటించారు. ఆజాద్కు మద్దతుగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిసి రాజీనామా లేఖను సమర్పించామని బల్వాన్ సింగ్ తెలిపారు. జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి 73 ఏళ్ల ఆజాద్, కాంగ్రెస్తో తన ఐదు దశాబ్దాల అనుబంధాన్ని శుక్రవారం ముగించారు. దీంతో నేతలు కూడా ఆయన వెంటే సాగుతున్నారు.