భారత్ వద్ద ఖతర్నాక్ మిస్సైల్స్- దెబ్బకు మఠాష్: అమెరికా నుంచి కొనుగోలు
భారత రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. సరిహద్దుల్లో శతృ దేశాల ముప్పును అడ్డుకోవడానికి వీలుగా అమెరికా నుంచి అత్యంత శక్తిమంతమైన జావెలిన్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్ సిస్టమ్ ను కొనుగోలు చేయడానికి భారత్ సన్నాహాలు చేస్తోంది. ఈ విషయాన్ని భారత్ లోని అమెరికా రాయబారి సెర్గియో గోర్ వెల్లడించారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని తన అధికారిక ఎక్స్ ప్లాట్ ఫామ్ లో పోస్ట్ చేశారు.
భారత్- అమెరికా మధ్య ద్వైపాక్షిక ఒప్పందాలు, రక్షణ రంగంలో భాగస్వామ్యాన్ని పెంపొందించే విషయంలో ఇదొక మైలురాయిగా మారుతుందని ఆయన పేర్కొన్నారు. అత్యంత శక్తిమంతమైన ఈ డిఫెన్స్ సిస్టమ్ ను కొనుగోలు చేయడానికి భారత్ ముందుకు వచ్చిందని, ఇప్పటికే అనేక దేశాలు దీన్ని వినియోగిస్తోన్నాయని సెర్గియో గోర్ అన్నారు.

ఎత్తైన పర్వతాలే కాకుండా మైదాన ప్రాంతాల్లోనూ జావెలిన్ యాంటీ గైడెడ్ మిస్సైల్స్ ను అవలీలగా వినియోగించవచ్చు. ఎటువంటి భౌగోళిక వాతావరణంలోనైనా మోహరింపజేయవచ్చు. జావెలిన్.. అనేది ఓ తేలికపాటి పోర్టబుల్ యాంటీ ట్యాంక్ మిస్సైల్ సిస్టమ్. దీన్ని సులభంగా ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. జవాన్లు తమ భుజాలపై ఉంచుకుని నేరుగా ప్రయోగించడానికి వీలుంటుంది. శత్రువుల భారీ యుద్ధ ట్యాంకులు, ఇతర సాయుధ వాహనాలను ఖచ్చితమైన లక్ష్యంతో ఛేదించే సామర్థ్యం దీనికి ఉంది.
ఫైర్ అండ్ ఫర్గెట్.. టెక్నాలజీ ఈ క్షిపణి వ్యవస్థ ప్రత్యేకత. అంటే.. ఒకసారి క్షిపణిని ప్రయోగించిన తర్వాత దాన్ని గైడ్ చేయాల్సిన అవసరం లేదు. ప్రయోగించిన తర్వాత అది సెల్ఫ్ గైడెన్స్ తో పని చేస్తుంది. యాంటీ మిస్సైల్స్ అటాక్ నుంచి కూడా తనను తాను రక్షించుకోగలుగుతుంది. యుద్ధ ట్యాంకుల పైభాగం నుంచి దాడి చేసే ఏకైక మిస్సైల్ ఇది. సాధారణంగా ట్యాంకుల పైభాగంలో వాటి కవచం బలహీనంగా ఉంటుంది. అందుకే ఈ పద్ధతి ద్వారా శతృవుల యుద్ధ ట్యాంకులను తుత్తునియలు చేయవచ్చు.
ఈ ఒప్పందం ఈ మిస్సైల్ సిస్టమ్ ను కొనుగోలు చేయడానికే పరిమితం కావట్లేదు. భారత్లోనే ఈ క్షిపణులను అమెరికాతో కలిసి కో ప్రొడక్షన్ చేసే అవకాశాలను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఈ ప్రతిపాదనలు కార్యరూపం దాల్చే అవకాశాలు లేకపోలేదు. మిస్సైల్ టెక్నాలజీ బదిలీ ద్వారా దేశీయంగా కూడా అత్యాధునిక ఆయుధాల తయారీ సామర్థ్యం మరింత పెరుగుతుంది.
BIG news! India plans to buy the battle-tested Javelin anti-tank system. Just as @secwar highlighted at the May 2026 Shangri-La Dialogue, this is a great step forward in the U.S.-India defense relationship and opens the door to co-production possibilities. The engagement between…
— Ambassador Sergio Gor (@USAmbIndia) August 28, 2026
గత ఏడాది నవంబర్ లో సుమారు 93 మిలియన్ డాలర్ల విలువైన రక్షణ పరికరాల విక్రయాలకు అమెరికా విదేశాంగ శాఖ ఆమోదం తెలిపింది. ఇందులో 100 వరకు జావెలిన్ యాంటీ ట్యాంక్ సిస్టమ్ తో తో పాటు, 216 ఎక్స్కాలిబర్ గైడెడ్ ఆర్టిలరీ ప్రొజెక్టైల్స్ సైతం ఉన్నాయి. ప్రస్తుతం భారత్ వద్ద అపాచీ, చినూక్ హెలికాప్టర్లు, సీ 17. సీ 130జే, పీ 8ఐ పెట్రోలింగ్ విమానాలు, ఎం777 హొవిట్జర్స్ వంటి అధునాతన యుద్ధ సాధనాలు ఉన్నాయి. అవన్నీ అమెరికా ఉత్పత్తి చేసినవే.














Click it and Unblock the Notifications