భారత్ కు బిగ్ రిలీఫ్: మళ్ళీ 20 వేల దిగువకు కరోనా కొత్త కేసులు, తగ్గుతున్న యాక్టివ్ కేసులు
భారత దేశంలో కరోనా కేసులు క్షీణిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గత 24 గంటల్లో భారతదేశంలో 18,346 కొత్త కేసులు నమోదయ్యాయి. 209 రోజుల తర్వాత తాజాగా నమోదైన కేసులు అత్యల్పంగా నమోదైన కేసులుగా ఉన్నాయి.ఇదిలా ఉంటే కరోనా యాక్టివ్ కేసులు కూడా తగ్గుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 2,52,902 గా ఉంది. కరోనా యాక్టివ్ కేసుల శాతం 0.75 శాతం గా ఉంది. తాజాగా 263మంది కరోనా కారణంగా మృతి చెందారు.ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా 4,49,260 కరోనా మరణాలు నమోదయ్యాయి.
కొత్త కేసుల కంటే కొత్తగా నమోదైన రికవరీలే ఎక్కువ
గత 24 గంటల్లో కనీసం 29,639 రికవరీలు నమోదు కాగా, భారతదేశంలో మొత్తం రికవరీల సంఖ్య 3,31,50,886 కి చేరాయి. రికవరీ రేటు ప్రస్తుతం 97.93% గా ఉందని ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ డేటా పేర్కొంది. కరోనా కొత్త కేసుల కంటే రోజువారీ రికవరీలు పెరగటం కాస్త ఊరటనిస్తున్న అంశం .అక్టోబర్ 4 వరకు పరీక్షించిన మొత్తం నమూనాల సంఖ్య 57,53,94,042 కాగా, నిన్న ఒక్క రోజే 11,41,642 నమూనాలను పరీక్షించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ తెలిపింది.

భారత్ లో వ్యాక్సినేషన్ ఇలా
భారతదేశంలోని పెద్దలకు డెబ్భై శాతం మందికి కోవిడ్ -19 వ్యాక్సిన్ యొక్క మొదటి డోస్ ఇవ్వబడినట్లు ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ చెప్పారు. అధికారుల ప్రకారం, పెద్దలకు 25 శాతం మందికి రెండు మోతాదులు ఇవ్వబడ్డాయి. దేశంలో ఇప్పటివరకు 91.54 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోస్లు ఇవ్వబడ్డాయి. ఇదిలా ఉంటే రోజువారీ పాజిటివిటీ రేటు1.61 శాతంగా ఉంది. గత 36 రోజులలో 3 శాతం కంటే తక్కువగా ఉంది. భారతదేశంలో వీక్లీ పాజిటివిటీ రేటు 1.66 శాతంగా ఉంది.
కేరళ, మహారాష్ట్రలలో కరోనా పరిస్థితి ఇదే
ఇదిలా ఉంటే కరోనా మహమ్మారి కారణంగా అత్యంత ప్రభావితమైన రాష్ట్రాల్లో నమోదవుతున్న కొత్త కరోనా కేసులు దేశవ్యాప్తంగా కరోనా కొత్త కేసులు పెరగడానికి కారణంగా మారుతున్నాయి. రోజువారీ కేసుల్లో అత్యధిక కేసులు నమోదు చేస్తున్న కేరళ రాష్ట్రంలో గత 24 గంటల్లో 8,850 కరోనా కొత్త కేసులు నమోదు కాగా, 149 మంది కరోనా కారణంగా మృతి చెందారు. ఇక ప్రస్తుతం కేరళ రాష్ట్రంలో 1,28,795 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలోనే అత్యంత ఎక్కువ కేసులు నమోదైన మహారాష్ట్రలో కరోనా కొత్త కేసులు గత 24 గంటల్లో 3165 నమోదుకాగా 27 మంది కరోనా కారణంగా మృతి చెందారు. మహారాష్ట్రలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 33,637 ఉన్నాయి.
వివిధ రాష్ట్రాలలో కరోనా లేటెస్ట్ డేటా ఇదే
మహారాష్ట్ర తర్వాత అత్యధిక కేసులు నమోదు చేసిన తమిళనాడు రాష్ట్రంలో 1467 కొత్త కేసులు నమోదు కాగా 16 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. ఇక తమిళనాడు రాష్ట్రంలో 16,864 యాక్టివ్ కేసులున్నాయి.ఆ తర్వాత పశ్చిమబెంగాల్లో కరోనా కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో 601 కొత్త కేసులు నమోదు కాగా, 12 మంది మరణించారు. 7,604 యాక్టివ్ కేసులున్నాయి. ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 429 కొత్త కేసులు నమోదు కాగా నలుగురు మరణించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 9,753 యాక్టివ్ కేసులున్నాయి. తరువాత ఒడిశాలో 407 కొత్త కేసులు నమోదయ్యాయి ఆరుగురు మరణించారు. ఒడిశాలో ప్రస్తుతం 4,485 యాక్టివ్ కేసులున్నాయి. ఆ తర్వాత కర్ణాటక రాష్ట్రంలో 397 కొత్త కేసులు నమోదు కాగా 13 మంది మరణించారు. కర్ణాటక రాష్ట్రంలో 11,992 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో గత 24 గంటల్లో 34 కరోనా కొత్త కేసులు నమోదు కాగా జీరో మరణాలు నమోదయ్యాయి. ఢిల్లీలో 398 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.












Click it and Unblock the Notifications