రాష్ట్రపతి రేసు నుంచి పవార్ ఔట్ ? ఓటమి తప్పదనే అంచనా-విపక్షాలకు భారీ షాక్
రాష్ట్రపతి ఎన్నికల వ్యవహారం దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీల్లో ఉత్కంఠ పెంచుతోంది. ఇప్పటికే రాష్ట్రపతి ఎన్నికల్లో అధికార ఎన్డీయే అభ్యర్దికి మద్దతు కూడగట్టేందుకు బీజేపీ ప్రయత్నాలు ప్రారంభించింది. అదే సమయంలో విపక్షాలు కూడా తమ తరఫున ఉమ్మడి అభ్యర్ధిని రంగంలోకి దింపేందుకు ప్రయత్నిస్తున్నాయి. రేపు ఇదే అంశంపై ఢిల్లీలో 22 విపక్ష పార్టీలు సమావేశం కానున్నాయి. ఇలాంటి సమయంలో విపక్ష పార్టీల్లో కీలక నేత శరద్ పవార్ ట్విస్ట్ ఇచ్చారు.

రాష్ట్రపతి ఎన్నికల పోరు
రాష్ట్రపతి ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. త్వరలో అధికార ఎన్డీయే తమ అభ్యర్ధిని ప్రకటించబోతోంది. అదే సమయంలో విపక్షాలు కూడా దీనికి పోటీగా తమ అభ్యర్దిని రంగంలోకి దించాలని నిర్ణయం తీసుకున్నాయి. రాష్ట్రపతిగా ఎన్నికయ్యేందుకు కావాల్సిన 10.86 లక్షల ఎలక్ట్రోరల్ కాలేజీ ఓట్లలో కేవలం 13 వేల ఓట్ల దూరంలో ఉన్న ఎన్డీయేకు వైసీపీతో పాటు ఇతర పార్టీలు మద్దతు ప్రకటించేందుకు సిద్ధమవుతున్నాయి. దీంతో విపక్షాలు నిలబెట్టే అభ్యర్ధిపై ఉత్కంఠ నెలకొంది.

శరద్ పవార్ ఔట్
రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల అభ్యర్ధిగా నిలబడతారని భావిస్తున్న ఎన్సీపీ అధినేత, రాజకీయ కురువృద్ధుడు శరద్ పవార్ చివరి నిమిషంలో ట్విస్ట్ ఇచ్చేలా ఉన్నారు. ఇప్పటికే ఆయన అభ్యర్ధిత్వంపై కాంగ్రెస్, ఎన్సీపీతో పాటు ఇతర విపక్ష పార్టీలన్నీ సానుకూలంగా ఉన్నాయి. రేపు ఢిల్లీలో జరిగే సమావేశంలో విపక్షాల అభ్యర్ధిగా పవార్ ను ప్రకటించడమే లాంఛనమే అన్న చర్చ జరుగుతోంది. ఈ తరుణంలో పవార్ ఇందుకు సుముఖంగా లేరని తెలుస్తోంది. తాజాగా ఎన్సీపీ సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణం.

పవార్ కీలక వ్యాఖ్యలు
రాష్ట్రపతి ఎన్నికల నోటిఫికేషన్ రాగానే వెంటనే స్పందించిన కాంగ్రెస్, టీఎంసీ వంటి పార్టీలు పవార్ అభ్యర్ధిత్వంపై మొగ్గుచూపాయి. అంతే కాదు ఈ ప్రతిపాదనను మిగతా విపక్షాలకు కూడా పంపాయి. అయితే పవార్ మాత్రం నిన్న రాత్రి జరిగిన ఎన్సీపీ భేటీలో తాను రాష్ట్రపతి అభ్యర్ధిత్వంపై ఆసక్తిగా లేనని తేల్చిచెప్పినట్లు తెలుస్తోంది. ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్దిగా ఉండేందుకు ఇష్టపడటం లేదని స్పషం చేశారు. దీంతో ఎన్సీపీ నేతలు కూడా పవార్ అభిప్రాయంతో షాక్ అయినట్లు తెలుస్తోంది.

పవార్ నిర్ణయం వెనుక?
రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్ధిగా నిన్నమొన్నటి వరకూ ప్రచారంలోకి వచ్చిన శరద్ పవార్ చివరి నిమిషంలో తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రేపు జరిగే విపక్షాల భేటీలో ఈ విషయం స్పష్టం చేయబోతున్నారు. అయితే పవార్ నిర్ణయం వెనుక విజయంపై ఆయనకు ఎలాంటి ఆశలు లేకపోవడమే కారణంగా కనిపిస్తోంది.
ప్రస్తుత పరిస్ధితుల్ని చూస్తుంటే ఎన్డీయే ఎలక్ట్రోరల్ కాలేజీలో సాధారణ మెజారిటీకి కేవలం 13వేల ఓట్ల దూరంలోనే ఉంది. అలాగే వైసీపీ, టీడీపీ, బీజేడీ, అన్నాడీఎంకే వంటి పార్టీలు బీజేపీకే మద్దతు పలికే అవకాశాలు ఉన్నాయి. దీంతో తెలిసి తెలిసి బరిలోకి దిగి ఓటమిపాలవ్వడం ఎందుకనే భావనలో పవార్ ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications