అసెంబ్లీ ఎన్నికల వేళ... రాహుల్ సొంత ఇలాఖాలో కాంగ్రెస్కు బిగ్ షాక్... నలుగురు కీలక నేతల రాజీనామా...
కేరళ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న వయనాడ్ లోక్సభ నియోజకవర్గంలో పార్టీకి చెందిన నలుగురు కీలక నేతలు రాజీనామా చేశారు. ఎన్నికల ముంగిట్లో ఇలా కీలక నేతలు పార్టీకి గుడ్ బై చెప్పడం... అదీ రాహుల్ గాంధీ నియోజకవర్గం కావడం హాట్ టాపిక్గా మారింది. రాబోయే ఎన్నికల్లో ఇది పార్టీకి నష్టం చేస్తుందనే వాదన బలంగా వినిపిస్తోంది.కేరళ జనం మూడ్ ఎల్డీఎఫ్కే అనుకూలంగా ఉందని ఇప్పటికే పలు సర్వేలు వెల్లడించిన విషయం సంగతి తెలిసిందే. ఇలాంటి తరుణంలో కాంగ్రెస్ నుంచి కీలక నేతలు బయటకు వెళ్లడం ఎన్నికల ఫలితాలపై ఎఫెక్ట్ చూపిస్తుందన్న చర్చ జరుగుతోంది.
ఎవరెవరు రాజీనామా చేశారు...
మాజీ కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యుడు,మున్సిపల్ కౌన్సిలర్ కెకె విశ్వనాథన్,కేపీసీసీ సెక్రటరీ ఎంఎస్ విశ్వనాథన్,డీసీసీ జనరల్ సెక్రటరీ పీకే అనిల్ కుమార్,మహిళా కాంగ్రెస్ నేత సుజయ వేణుగోపాల్... కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినవారిలో ఉన్నారు. రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకత్వం,వయనాడ్ జిల్లా కమిటీ తమను పట్టించుకోని కారణంగానే రాజీనామా చేసినట్లు కెకె విశ్వనాథ్ తెలిపారు. జిల్లా నాయకత్వంలో ఒక సామాజికవర్గానికి చెందినవారి ఆధిపత్యమే నడుస్తోందని ఆయన ఆరోపించారు. త్వరలోనే విశ్వనాథ్ సీపీఎం పార్టీలో చేరవచ్చునన్న ప్రచారం జరుగుతోంది.డీసీసీ జనరల్ సెక్రటరీ పీకే అనిల్ కుమార్ ఇప్పటికే లోక్ జనతంత్రిక్ పార్టీలో చేరిపోయారు. కాంగ్రెస్ పార్టీలో తనను పక్కనపెట్టడం,స్థానికుల సెంటిమెంట్లను పట్టించుకోకపోవడమే తన రాజీనామాకు కారణమని ఆయన చెప్పారు.
ఎన్నికలపై ఎఫెక్ట్ పడుతుందా?
దేశమంతా తమ ప్రాభవాన్ని కోల్పోయి మూడు,నాలుగు రాష్ట్రాలకే పరిమితమైన కాంగ్రెస్ తిరిగి పుంజుకోవాలంటే రాబోయే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటి తీరాలి. ఇలాంటి తరుణంలో స్వయంగా రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న వయనాడ్ జిల్లాలోనే పార్టీకి ప్రతికూల పరిస్థితులు ఏర్పడటంపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ ఎఫెక్ట్ ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపిస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.గత 2016 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేత్రుత్వంలోని యూడీఎఫ్ కేరళలో 47 సీట్లకే పరిమితమైంది. అయితే కేరళ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి గత 40 ఏళ్ల ట్రాక్ రికార్డును పరిశీలిస్తే... ప్రతీ ఐదేళ్లకోసారి అక్కడ ప్రభుత్వం మారిపోతుంటుంది. కానీ ఆ రికార్డును చెరిపేసేలా ఈసారి కేరళ ప్రజలు మళ్లీ ఎల్డీఎఫ్కే పట్టం కట్టే అవకాశాలు ఉన్నట్లు సర్వేలు చెప్తున్నాయి.
ఎల్డీఎఫ్కు అనుకూలంగా సర్వేలు..
ఇటీవల వెలువడ్డ ఏబీపీ సీ ఓటర్ సర్వేలో కేరళలో వార్ వన్సైడ్గానే ఉంటుందని వెల్లడైంది. అధికారిక ఎల్డీఎఫ్ పార్టీ తిరిగి అధికారం చేపడుతుందని ఏబీపీ, సీ-ఓటర్ సర్వే జోస్యం చెప్పింది. మొత్తం 140 అసెంబ్లీ స్థానాలున్న కేరళలో సీపీఐఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్ పార్టీ 83 నుంచి 91 స్థానాలను కైవసం చేసుకుంటుందని సర్వేలో వెల్లడైంది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు దక్కే అవకాశాలు ఉన్నట్లు వెల్లడైంది. కేరళలో బీజేపీ పెద్దగా ప్రభావం చూపదని ఏబీపీ సీఓటర్ సర్వే వెల్లడించింది. రాష్ట్రంలో బీజేపీ 0 నుంచి 2 సీట్లు మాత్రమే సాధిస్తుందని తేల్చింది. ఏప్రిల్ 6న కేరళలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మే 2న ఫలితాలు వెలువడుతాయి.