మమతకు కేంద్రం మరో షాక్-రోమ్ శాంతి సదస్సుకు నో-మోడీ మీ సమస్యేంటన్న టీఎంసీ
కేంద్రం, పశ్చిమబెంగాల్ ప్రభుత్వం మధ్య సాగుతున్న పోరులో సీఎం మమతా బెనర్జీకి మరో ట్విస్ట్ ఎదురైంది. అక్టోబర్ లో ఇటలీ రాజధాని రోమ్ లో జరిగే ఓ అంతర్జాతీయ శాంతి సదస్సులో పాల్గొనేందుకు మమతా బెనర్జీకి ఆహ్వానం అందింది. దీంతో అక్కడికి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కేంద్రాన్ని మమత కోరారు. అయితే దీనికి విదేశాంగశాఖ నిరాకరించింది.
మమతా బెనర్జీకి రోమ్ వెళ్లేందుకు విదేశాంగశాఖ అనుమతి నిరాకరించడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. క్లియరెన్స్ రాజకీయ కోణంలోనే తిరస్కరించినట్లు ప్రచారం జరుగుతోంది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పాల్గొనే హోదాకు అనుగుణంగా ఈ ఈవెంట్ జరగదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ఈ సమావేశానికి జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్, పోప్ ఫ్రాన్సిస్, ఇటాలియన్ ప్రధాన మంత్రి మారియో డ్రాగి హాజరు కానున్నారు. ఈ కార్యక్రమం మదర్ థెరిస్సాపై ఏర్పాటు చేశారు.
ఇంతకు ముందు, ఇటాలియన్ ప్రభుత్వం మమతా బెనర్జీని ప్రతినిధుల్ని తీసుకురావద్దని అభ్యర్థించింది. పశ్చిమ బెంగాల్ సిఎం మమతా బెనర్జీ అప్పుడు తమ ప్రతినిధుల క్లియరెన్స్ను ప్రతిపాదించారు ఇందుకోసం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను అభ్యర్థించారు. అయితే ఆమెకు క్లియరెన్స్ లభించలేదు. మమతా బెనర్జీకి రోమ్ టూర్ అనుమతి నిరాకరణపై టీఎఁసీ అధికార ప్రతినిధి దేబాంగ్షు భట్టాచార్య దేవ్ ట్విట్టర్లో తీవ్రంగా స్పందించారు. "దీదీ రోమ్ పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. గతంలో వారు చైనా పర్యటనకు కూడా అనుమతి రద్దు చేశారు. అంతర్జాతీయ సంబంధాలు, భారతదేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మేము ఆ నిర్ణయాన్ని అంగీకరించాము. ఇప్పుడు ఇటలీ టూర్ కు నిరాకరణ ఎందుకంటూ ఆయన ప్రశ్నించారు.
పశ్చిమబెంగాల్లో బీజేపీతో హోరాహోరీ పోరాడి హ్యాట్రిక్ గెలుపు సాధించిన మమతా బెనర్జీపై ఆ పార్టీకి పీకలదాకా కోపం ఉంది. మమత ఎక్కడ దొరుకుతుందా అని బీజేపీ ఎదురుచూస్తోంది. ఇలాంటి సమయంలో గతంలో చైనా టూర్ కు వెళ్లేందుకు అనుమతి కోరినా దేశ ప్రయోజనాల పేరుతో అనుమతి ఇవ్వలేదు. ఇప్పుడు కూడా సాంకేతిక కారణాలు చూపి మమత వెళ్లకుండా అడ్డుకున్నట్లు కనిపిస్తోంది. దీనిపై తృణమూల్ వర్గాలు మండిపడుతున్నారు. అసలే బెంగాల్లో బీజేపీ నుంచి తృణమూల్ కాంగ్రెస్ కు ఫిరాయింపులు కొనసాగుతుండటం, భవానీపూర్ ఉపఎన్నికలో మమతను ఓడించేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీయే సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం చర్చనీయాంశమవుతోంది.