డ్రగ్స్ కేసులో భారీ ట్విస్టులు-సమీర్ వాంఖడే వర్సెస్ మహా సర్కార్-ఆర్యన్ కేసులో ఎన్సీబీపై ఒత్తిడి
బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ ను డ్రగ్స్ కేసులో అరెస్టు చేసిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధిపతి సమీర్ వాంఖడేకూ, మహారాష్ట్రలోని సంకీర్ణ సర్కారుకూ మధ్య సాగుతున్న పోరు నానాటికీ ముదురుతోంది. ఆర్యన్ ఖాన్ కేసులో సమీర్ వాంఖడే అత్యుత్సాహంపై ఉద్ధవ్ థాక్రే సర్కార్ లోని ఎన్సీపీ మంత్రి నవాబ్ మాలిక్ తీవ్ర విమర్శలకు దిగుతున్నారు. ఇదే క్రమంలో వాంఖడే పుట్టుక గురించి కూడా విమర్శలు చేశారు. దీనిపై ఇవాళ వాంఖడే తీవ్రంగా స్పందించారు.
ఎన్సీబీ ఛీఫ్ సమీర్ వాంఖడే తల్లి ముస్లిం అని, అతను జనన ధృవీకరణ పత్రాన్ని ఫోర్జరీ చేశాడని మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ సంచలన ఆరోపణలు చేశారు. నకిలీ అక్కడి నుంచే ప్రారంభమైందంటూ నవాబ్ మాలిక్ ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన వాంఖడే... " నా కుల ధృవీకరణకు సంబంధించి నవాబ్ మాలిక్ ఇటీవల చేసిన ట్వీట్ గురించి నేను తెలుసుకున్నాను. ఇది డ్రగ్స్ కేసుతో సంబంధం లేని విషయాలను తీసుకురావడానికి నాసిరకం ప్రయత్నం. నా తల్లి ముస్లిం... (ఎందుకు) అతను నా చనిపోయిన తల్లిని ఇందులోకి తీసుకురావాలనుకుంటున్నాడని ప్రశ్నించారు.
తన కులం, నేపథ్యాన్ని తెలుసుకోవడానికి ఎవరైనా తన స్వస్థలాన్ని సందర్శించవచ్ని, తన తాత నుండి తన సంతతిని ధృవీకరించుకోవచ్చని వాంఖడే తెలిపారు. కానీ అతను( నవాబ్ మాలిక్) ఈ మురికిని ఇలా వ్యాప్తి చేయకూడదని వాంఖడే వ్యాఖ్యానించారు. దీనిపై తాను చట్టపరంగా పోరాడతాననన్నారు. దీనిపై మరింతగా వ్యాఖ్యానించడం తనకు ఇష్టం లేదన్నారు. అనంతరం వాంఖడే డ్రగ్స్ కేసు విచారిస్తున్న ముంబై ప్రత్యేక కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ లో చనిపోయిన తన తల్లితో పాటు సోదరి కూడా టార్గెట్ లో ఉన్నట్లు పేర్కొనడం సంచలనం రేపింది.
మరోవైపు బాలీవుడ్ ను టార్గెట్ చేస్తున్న సమీర్ వాంఖడే ఎక్కువకాలం ఆ పదవిలో ఉండడంటూ మహారాష్ట్ర ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటికే డ్రగ్స్ కేసు నుంచి ఆర్యన్ ఖాన్ ను తప్పించేందుకు వాంఖడే రూ.25 కోట్లు డిమాండ్ చేసినట్లు ఈ కేసులో సాక్షిగా ఉన్న ఓ వ్యక్తి సంచలన ఆరోపణలు చేశారు. అంతకు ముందు నుంచే వాంఖడేపై మహారాష్ట్ర సర్కార్ లో సీఎం సహా సహా మంత్రులు కూడా విరుచుకుపడుతున్నారు. ఈ కోవలోనే మహారాష్ట్రమంత్రి నవాబ్ మాలిక్ కూడా ఏడాదిలోగా వాంఖడే పదవి కోల్పోతాడని చెప్పుకొచ్చారు.
బీజేపీ చేతుల్లో కీలుబొమ్మగా మారిీ వాంఖడే పెట్టిన బూటకపు కేసులకు తన వద్ద ఆధారాలు ఉన్నాయని కూడా చెప్పారు. లాక్ డౌన్ సమయంలో కుటుంబంతో కలిసి అతను మాల్దీవులకు ఎందుకు వెళ్లాడని కూడా ఆయన ప్రశ్నించారు. దీనిపై స్పందించిన వాంఖడే... తన సొంత ఖర్చుతో కుటుంబంంతో కలిసి వెళ్లానని వివరణ ఇచ్చారు. మరోవైపు వాంఖడే పై సంచలన ఆరోపణలు చేసిన సాక్షి సెయిల్ ధైర్యాన్ని మహారాష్ట్ర ప్రభుత్వంలో కీలకంగా ఉన్న శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మెచ్చుకున్నారు. అతనికి ప్రభుత్వం రక్షణ కల్పించాలని కోరారు.