అన్లాక్ ఎఫెక్ట్?: దేశంలో పీక్స్లో కరోనా: 83 వేలకు పైగా కొత్త కేసులు: మరణాల్లో మూడో స్థానంలో
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. రోజువారీ కేసుల్లో నయా రికార్డును నెలకొల్పింది. ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఈ స్థాయిలో కరోనా వైరస్ రోజువారీ కేసులు నమోదు కాలేదు. అత్యధిక మరణాలు, అదే స్థాయిలో కరోనా కేసులను చవి చూస్తోన్న అగ్రరాజ్యం అమెరికాలో కూడా ఈ రేంజ్లో బిత్తరపోయేలా కేసులు రికార్డు కాలేదు. దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో పుట్టుకొస్తోన్న కొత్త కేసుల్లో ఈ పెరుగుదలను ఏ మాత్రం ఊహించలేదని అధికారులు చెబుతున్నారు.
ఇదే వేగం మరి కొంతకాలం పాటు కొనసాగితే.. భారత్ ప్రపంచంలోనే అత్యధిక కరోనా కేసుల జాబితాలో రెండో స్థానాన్ని ఆక్రమించుకోవడానికి ఎక్కువ సమయం పట్టకపోవచ్చు. దేశవ్యాప్తంగా 24 గంటల వ్యవధిలో కొత్తగా 83,883 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కరోనా బారిన పడిన ఏ దేశంలో కూడా రోజువారీ కేసుల్లో ఈ పెరుగుదల కనిపించలేదు 24 గంటల్లో 1043 మంది మరణించారు. దీనితో ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 38,53,407కు చేరుకుంది. ఇప్పటిదాకా 67,376 మంది మరణించారు. దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 8,15,538కి చేరుకుంది. 29,70,493 మంది డిశ్చార్జి అయ్యారు.
దీనికి సంబంధించిన వివరాలతో కూడిన తాజా బులెటిన్ను కొద్దిసేపటి కిందటే కేంద్ర వైద్య మంత్రిత్వ శాఖ అధికారులు విడుదల చేశారు. రోజువారీ కేసుల్లో 80 వేల మార్క్ను అందుకోవడం ఇదే తొలిసారి. ఇప్పటిదాకా 75 వేల నుంచి 79 వేల మధ్య నమోదయ్యే కరోనా కేసులు కొత్తగా 84 వేలకు చేరువగా వెళ్లడం అధికారులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అన్లాక్ అమల్లోకి వచ్చిన ప్రభావం ఈ అంకెలపై స్పష్టంగా కనిపిస్తోందని అంచనా వేస్తున్నారు. కరోనా మరణాల్లో భారత్ మూడో స్థానంలో కొనసాగుతోంది.
అమెరికా, బ్రెజిల్ తరువాత ఆ స్థాయిలో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య భారత్లోనే అధికం. ఇప్పటిదాకా మూడోస్థానంలో కొనసాగిన మెక్సికోను భారత్ అధిగమించింది. ఏపీ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో కరోనా వైరస్ కేసుల్లో ఏ మాత్రం తగ్గుదల కనిపించట్లేదు. కరోనాను నియంత్రించడానికి తీసుకుంటోన్న చర్యలేవీ పెద్దగా ఉపకరించిన దాఖలాలు లేవనేది దీనితో స్పష్టమౌతోంది.
Recommended Video
దేశంలో కరోనా వైరస్ పరీక్షలు రికార్డు స్థాయిలో కొనసాగుతున్నాయి. ఇప్పటిదాకా పరీక్షించిన శాంపిళ్లు నాలుగున్నర కోట్లను దాటేశాయి. ఇప్పటిదాకా 4,55,09,380 శాంపిళ్లను పరీక్షించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) వెల్లడించింది. బుధవారం ఒక్కరోజులో 11,72,179 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది. ఉత్తర ప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర, ఏపీ, కర్ణాటకల్లో కరోనా శాంపిళ్ల పరీక్షలు పెద్ద సంఖ్యలో కొనసాగుతున్నాయి. ఈ అయిదు రాష్ట్రాలూ టాప్ ప్లేస్లో ఉన్నాయి. ఆయా రాష్ట్రాల్లో కరోనా రోజువారీ పాజిటివ్ కేసుల్లో వేల సంఖ్యలో నమోదవుతున్నాయి.