బీహార్ ఎన్నికలు: పోటీ చేయడం లేదన్న లాలూ, సీఎం అభ్యర్థిగా నితీశ్
న్యూఢిల్లీ: ఈ ఏడాది బీహార్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో జనతా పరివార్ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా నితీశ్ కుమార్ను ఎన్నుకున్నట్లు సమాజ్ వాదీ సుప్రిమో ములాయం సింగ్ యాదవ్ సోమవారం తెలిపారు.
ఈ సందర్భంగా ములాయం మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికల్లో జేడీయూ-ఆర్జేడీ కూటమికి నితీశ్ నేతృత్వం వహిస్తారని చెప్పారు. తామంతా కలిసికట్టుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటామని చెప్పారు.
ఈ ఎన్నికల్లో జేడీయూ, కాంగ్రెస్, ఆర్జేడీ కలిసికట్టుగా పనిచేయనున్నట్లు ఆయన ప్రకటించారు. ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి అభ్యర్ధిని ములాయం ప్రకటిస్తారని చెప్పిన ఆయన, సీఎం అభ్యర్థిగా ఆర్జేడీ నుంచి ఎవరూ ఆసక్తిగా లేరని చెప్పారు.

భారతీయ జనతా పార్టీని ఓడించేందుకే ఆర్జేడీ, జేడీయూ ఒకటయ్యాయని అన్న లాలూ నితీశ్తో ఎలాంటి విభేదాలు లేవన్నారు. నేను ఎన్నికల్లో పోటీ చేయడం లేదన్నారు. సీఎం రేసులో కూడా తాను లేనని ప్రకటించారు.
బీహార్ అసెంబ్లీ గడువు 2015 నవంబర్ 29 నాటికి ముగియనుంది. సెప్టెంబర్ లేదా అక్టోబర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దేశంలో విజయ పథంలో దూసుకుపోతున్న మోడీ హవాని ఎదుర్కునేందుకు లాలూ నేతృత్వంలోని ఆర్జేడీ, శరద్యాదవ్, నితిష్కుమార్ నేతృత్వంలోని జేడీయూ ఒకటయ్యాయి.
ఏప్రిల్ 15న ప్రాంతీయ పార్టీలైన జనతాదళ్ యునైటెడ్, రాష్ట్రీయ జనతాదళ్, సమాజ్ వాదీ పార్టీలు జనతా పరివార్గా అవతరించిన సంగతి తెలిసిందే. జనతా పరివార్కు ములాయం సింగ్ యాదవ్ను అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు.
ఎన్నికల్లో ఈ రెండు పార్టీల మధ్య పొత్తు కుదర్చడంలో సమాజ్వాదీపార్టీ అధినేత ములాయం కీలకంగా వ్యవహరించారు. ఢిల్లీలోని ములాయం సింగ్ యాదవ్ నివాసంలో వీరిద్దరి భేటీ జరిగింది. ఈ సమావేశం అనంతరం ఎస్పీ నేత రాంగోపాల్ యాదవ్ మీడియాతో మాట్లాడారు.
బీహార్ ఎన్నికల నేపథ్యంలో ఆర్జేడీ, జేడీయూ పార్టీల నుంచి చెరో ముగ్గురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేస్తారని, సీట్ల సర్దుబాట్లపై ఆ కమిటీ నిర్ణయిస్తుందని చెప్పారు. ప్రస్తుతం ప్రధానంగా సీట్ల సర్దుబాట్లపైనే దృష్టి సారించామని ఆయన పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications