రైతు పొలం దున్నుతుండగా బయటపడ్డ నోట్ల కట్టలు: సంతోషం క్షణాల్లో అవిరి!
పాట్నా: బీహార్ రాష్ట్రంలోని పాట్నా జిల్లా పౌడా గ్రామంలో ఓ రైతు పొలంలో నోట్ల కట్టలు బటయపడ్డాయి. ట్రాక్టర్తో పొలం దున్నుతుండగా.. నోట్ల కట్టలు గుట్టలుగా వెలుగుచూశాయి. దీంతో అతడు ఎంతో సంతోష పడ్డాడు. కానీ, ఆ సంతోషం క్షణాల్లోనే అవిరైపోయింది.
పొలం దున్నుతుండగా బయటపడ్డ నోట్ల కట్టలు
ఆ వివరాల్లోకి వెళితే.. అజయ్ సింగ్ తన పొలాన్ని దున్నిస్తున్నాడు. ఈ క్రమంలో ట్రాక్టర్ డ్రైవర్కు కరెన్సీ నోట్ల కట్టల సంచి ఒకట దొరికింది. ట్రాక్టర్ నాగలికి ఈ సంచి తగలడంతో బయటికి తీశాడు. అందులో రూ. 500, రూ. 1000 నోట్ల కట్టలు ఉన్నాయి. కాగా, ఈ విషయం అజయ్ సింగ్ కు తెలుసే లోగానే అక్కడికి గ్రామస్తులంతా చేరుకుని ఆ నోట్ల కట్టలను ఎవరికి దొరికినంత వారు ఎత్తుకెళ్లారు.
పోలీసులు వచ్చేలోగా కరెన్సీ నోట్లు మాయం
నోట్ల కట్టలకు సంబంధించిన విషయం పోలీసులకు కూడా చేరింది. దీంతో పోలీసులు కూడా అజయ్ సింగ్ పొలం వద్దకు వచ్చారు. అయితే, అప్పటికే గ్రామస్తులంతా ఆ నోట్ల కట్టలను తీసుకుని పారిపోయారు. పొలం లభించిన కొన్ని నోట్ల కట్టలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అవన్నీ రద్దైన రూ. 500, రూ. 1000 నోట్లే: సీజ్ చేస్తామన్న పోలీసులు
అయితే, ఆ నోట్లన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం గతంలో రద్దు చేసిన నోట్లే కావడం గమనార్హం. రూ. 500, రూ. 1000 నోట్ల కట్టలతో ఉన్న మూటను పొలంలో ట్రాక్టర్ డ్రైవర్ గుర్తించాడని పోలీసులు తెలిపారు. అయితే, ఈ డబ్బు ఎవరిది? ఎందుకు ఇక్కడ దాచారు? అనే విషయంపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అంతేగాక, ఈ నోట్లను ఎత్తుకెళ్లిన వారిని గుర్తించి, వారి దగ్గర్నుంచి తిరిగి వాటిని స్వాధీనం చేసుకుంటామని పోలీసులు వెల్లడించారు.