తేజస్వీ యాదవ్ తో నితీష్ కుమార్ ఏం మాట్లాడారంటే..
బిహార్ లో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు జనతాదళ్ (యూ) నేత నితీష్ కుమార్ రంగం సిద్ధం చేస్తున్నారు. మిత్రపక్షం భారతీయ జనతాపార్టీకి షాకిస్తూ ఆయన రాష్ట్రీయ జనతాదళ్ తో కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తన పదవికి రాజీనామా చేసిన నితీష్ నేరుగా ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ నివాసానికి వెళ్లి కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించారు.
తేజస్వీతో నితీష్ మాట్లాడుతూ ''2017లో ఏం జరిగిందో అదంతా మర్చిపోదామన్నారని.. కొత్త అధ్యాయాన్ని మొదలుపెడదామన్నారని'' చెప్పినట్లుగా జేడీయూ పార్టీ వర్గాలు వెల్లడించాయి. ''ఆర్జేడీ, కాంగ్రెస్, జేడీయూ కూటమి మహాగఠ్ బంధన్ నుంచి విడిపోయి తాను తప్పు చేశానని, ఇందుకు పశ్చాత్తాప పడుతున్నానని'' నితీష్ కుమార్ విచారం వ్యక్తం చేసినట్లుగా తెలిపాయి.
నితీష్ తో పొత్తుకు తేజస్వీ కూడా సుముఖత వ్యక్తం చేశారు. కూటమి నేతగా నితీష్ ను ఎన్నుకున్నారు. జీతన్ రామ్ మాంజీకి చెందిన హిందూస్థానీ అవామీ మోర్చా కూడా నితీష్ కు మద్దతు ప్రకటించింది. కొత్త కూటమి ఏర్పాటు చేయడంపై కమలం పార్టీ నేతలు నితీష్ కుమార్ పై మండిపడుతున్నారు.
నితీష్ బీజేపీతోపాటు బిహార్ ప్రజలను కూడా మోసం చేశారని, 2020 ఎన్నికల్లో ఎన్డీయే కూటమి నుంచి పోటీచేసి విజయం సాధించామని, మాకు సంఖ్యాబలం ఎక్కువగానే ఉన్నప్పటికీ ఆయన్నే ముఖ్యమంత్రిని చేశామని, కానీ ఆయన మోసం చేశారని, దీన్ని రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ సహించరని బీజేపీ బీహార్ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ జైశ్వాల్ ధ్వజమెత్తారు.