నిర్లక్ష్యం చేస్తే చేతులు నరికేస్తా: వైద్యులకు బీహార్ సిఎం
మోతిహరి: బీహార్ ముఖ్యమంత్రి జితన్ రామ్ మాంజీ శుక్రవారం ప్రభుత్వ వైద్యులపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆయన శుక్రవారం మాట్లాడుతూ.. పేద రోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే వైద్యుల చేతులను నరికేస్తామని తీవ్రంగా హెచ్చరించారు.
‘నేను ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొంటా. కానీ, పేద రోగుల ప్రాణాలతో చెలగాటమాడితే మాత్రం వైద్యులను ఉపేక్షించేది లేదు' అని తూర్పు చాంపరన్ జిల్లాలోని ఓ ఆస్పత్రి ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యమంత్రి జితన్ రామ్ అన్నారు. ఒక వేళ పేద రోగులు తమ భూములను తాకట్టు పెడితే.. వారి పట్ల కరుణతో వైద్య సేవలు అందించాలని తూర్పు చంపారన్ డిఎంకు ఆయన సూచించారు.
అంతేగాని వారి భూములను కొనుగోలు చేయకూడదని అన్నారు. ఒకవేళ పేదలు తమకు ప్రభుత్వం ఇచ్చిన భూములను అమ్ముకుని వైద్యం చేయించుకుంటే.. ఆ భూములు కొనుగోలు చేసిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వం పేదలకు అందించిన ఆ భూములు బదిలీ చేయబడవని తెలిపారు.
అంతకుముందు మోతిహరికి సమీపంలో మహాదళితులతో మాట్లాడుతూ.. దళిత పేదలు మద్యం సేవించడం మానుకుని, ఆ డబ్బును పొదుపు చేసుకోవాలని సూచించారు. పిల్లల చదువులకు పొదుపు చేసిన డబ్బును ఉపయోగించుకోవాలని సిఎం జితిన్ రామ్ వారికి సూచించారు. ఎవరి టాయ్ లెట్లు వారే శుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు.
‘నా టాయ్లెట్ నేనే శుభ్రం చేసుకుంటాను' అని సిఎం జితిన్ తెలిపారు. సమస్యలు తెలుసుకునేందుకు తాను దళితులు నివాసాముండే ప్రాంతాలను సందర్శిస్తున్నట్లు తెలిపారు. పరిశుభ్రమైన నీటినే సేవించాలని ఆయన ప్రజలకు సూచించారు. పట్టణ పేదలకు 3.5 డెసిమెల్స్కు 5డెసిమెల్స్ భూమిని ఇస్తామని చెప్పారు. వంద కుటుంబాలకు మించిన గ్రామాలకు రోడ్డు, టాయ్లెట్ సౌకర్య కల్పిస్తామని చెప్పారు.