రహస్య ఓటింగ్ పెట్టండి: గవర్నర్కు మాంఝీ వినతి, నితీశ్ ఎన్నిక చెల్లదని..
పాట్నా: తనకు వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందని బీహార్ ముఖ్యమంత్రి జితన్ రాం మాంఝీ అన్నారు. ఆయన సోమవారం గవర్నర్ను రెండుసార్లు కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విశ్వాస తీర్మానం చేసే సమయంలో రహస్య ఓటింగ్ నిర్వహించాలని గవర్నర్ను కోరినట్లు తెలిపారు.
‘అసెంబ్లీలో బలం నిరూపించుకునేందుకు తేదీ ఇవ్వాలని కోరాను. నేను ఫిబ్రవరి 19, 20 లేదా 23 తేదీల్లో మెజార్టీని నిరూపించుకుంటా. నేను ఇప్పటికీ సభ నాయకుడినే. మెజార్టీ ఉంది' అని మాంజీ పేర్కొన్నారు. బీహార్లో ప్రస్తుత రాజకీయాలపై గవర్నర్తో చర్చించామని తెలిపారు.
పార్టీ తనను బహిష్కరించినట్లు లేఖ అందలేదని చెప్పారు. తనకు వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందని మాంఝీ అన్నారు. శాసనసభలో మెజార్టీని నిరూపించుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. శాసనసభా పక్ష నేతగా నితీశ్ కుమార్ ఎన్నిక చెల్లదని మాంఝీ అన్నారు.
కాగా, బీహార్ మాజీ ముఖ్యమంత్రి అయిన నితీశ్ కుమార్ కూడా సోమవారం గవర్నర్ను కలిశారు. ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాలని ఆయన గవర్నర్ను కోరారు.నితీశ్ కుమార్ మాట్లాడుతూ.. కొన్ని రోజుల తర్వాత తమ బలాన్ని ఢిల్లీలో రాష్ట్రపతి ఎదుట ప్రదర్శిస్తామన్నారు. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకుంటే స్పష్టంగా ప్రకటించాలని నితీశ్ అన్నారు. బడ్జెట్ సమావేశాలకు ముందే గవర్నర్ నిర్ణయం తీసుకోవాలని, మంత్రి మండలి ఏకాభిప్రాయం ఉంటేనే ఏ నిర్ణయమైనా తీసుకోవాలని అన్నారు.
కాగా, నితీశ్ కుమార్కు 130 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని జెడియు ప్రకటించింది. నితీశ్ కుమార్ తోపాటు ఆర్జేడి అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, జెడియు నేత శరద్ యాదవ్ గవర్నర్ను కలిశారు. గవర్నర్తో సంతృప్తికరంగా చర్చలు జరిగాయని తెలిపారు. నితీశ్ కుమార్ ముఖ్యమంత్రి బాధ్యతలు తీసుకోవాలని లాలూ ప్రసాద్ యాదవ్ కోరారు.