ఉత్తరాదిని వణికిస్తున్న భారీ వర్షాలు, వరదలు: జనజీవనం అస్తవ్యస్థం, 100కి పైగా మృతి
పాట్నా: ఉత్తర భారతదేశంలో కురుస్తున్న భారీ వర్షాలు వివిధ రాష్ట్రాల్లో బీభత్సం సృష్టిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పలు గ్రామాలు, నగరాలు వరదనీటిలో మునిగిపోయాయి. వర్షాలు, వరదల కారణంగా ఇప్పటికే వందమందికిపైగా మృత్యువాతపడటం గమనార్హం.

ఆస్పత్రులు, పాఠశాల్లోకి నీరు..
ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లోని పలు నగరాలు, గ్రామాలు వరదనీటిలో మునిగిపోయాయి. ప్రజలు ఇళ్ల నుంచే బయటికి వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాయి. వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడుతున్నాయి. పాఠశాలలు, ఆస్పత్రుల్లోకి వరద నీరు చేరడంతో విద్యార్థులు, రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భారీ వర్షాల కారణంగా పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.

డిప్యూటీ సీఎం, మంత్రుల ఇళ్లలోకి వరద నీరు..
బీహార్ రాష్ట్ర రాజధాని పాట్నాలో అనేక ప్రాంతాలో జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. బీహార్ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోడీ, మరో మంత్రి ఇళ్లల్లోకి కూడా వరదనీరు చేరింది.

నిలిచిన అత్యవసర సేవలు..
శుక్రవారం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలో అత్యవసర సేవలుకూడా నిలిచిపోయాయి. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రైళ్లు కూడా పలు మార్గాల్లో నిలిచిపోయాయి. రోడ్లపై వాహనాలు కాకుండా పడవలు ప్రయాణించాయి. కాగా, సీఎం నితీష్ కుమార్ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.

స్తంభించిన జనజీవనం
ఉత్తరప్రదేశ్లోనూ వర్షాలు, వరదలు జనజీవనాన్ని స్తంభింపజేశాయి. గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఇప్పటి వరకు 70మందికిపైగా మృతి చెందారు. వర్షాలు, వరద, సహాయక చర్యలపై సీఎం యోగి ఆదిత్యనాథ్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. మృతుల కుటుంబాలకు రూ. 4లక్షల పరిహారం ప్రకటించారు.

వర్షాల బీభత్సం..
ఇక ఉత్తరాఖండ్ రాష్ట్రంలోనూ భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. హిమకుండ్ సాహెబ్కు వెళ్తున్న యాత్రికుల వాహనంపై భారీ బండరాయి జారిపడటంతో ఆరుగురు మృతి చెందారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. కాగా, సెప్టెంబర్ 30 వరకు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.












Click it and Unblock the Notifications