షూటర్, మాజీ కేంద్రమంత్రి దిగ్విజయ్ సింగ్ కూతురు శ్రేయాసి సింగ్ బీజేపీలో చేరిక
పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రముఖ షూటర్, మాజీ కేంద్రమంత్రి దిగ్విజయ్ సింగ్ కూతురు శ్రేయాసి సింగ్ ఆదివారం భారతీయ జనతా పార్టీ(బీజేపీ)లో చేరారు. బీజేపీ బీహార్ శాఖ చీఫ్ భూపేంద్ర యాదవ్ సమక్షంలో ఆమె పార్టీలో చేరారు.
జుముయ్ జిల్లా గిధౌర్కు చెందిన శ్రేయాసి సింగ్ను బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అమర్పూర్ నుంచి బీజేపీ బరిలో దింపే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా, శ్రేయాసి సింగ్ 2018లో ఆస్ట్రేలియాలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్లో బంగారం పతకం, స్కాట్లాండ్లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్లో వెండి పతకం సాధించారు.
2013లో మెక్సికోలో జరిగిన ట్రాప్ షూటింగ్ వరల్డ్ కప్ లోనూ శ్రేయాసి సింగ్ భారత జట్టు తరపున ప్రాతినిథ్యం వహించారు. కాగా, 2018లో షూటింగ్ విభాగంలో ఆమె అర్జున అవార్డును పొందారు. శ్రేయాసి గతంలో ఆర్జేడీ సహా పలు ఇతర పార్టీలతో సంప్రదింపులు జరిపినా చివరికి బీహార్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో బీజేపీలో చేరడం గమనార్హం.
కాగా, శ్రేయాసి తండ్రి దిగ్విజయ్ సింగ్ గతంలో కేంద్రమంత్రిగా పనిచేశారు. చంద్రశేఖర్ ప్రభుత్వంలో, అటల్ బీహారీ వాజపేయి ప్రభుత్వంలో రైల్వే శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. 2010లో ఈయన మరణించారు. శ్రేయాసి సింగ్ తల్లి పుతుల్ సింగ్ బీహార్ లోని బంకా నుంచి ఎంపీగా పార్లమెంటుకు ప్రాతినిథ్యం వహించారు.