ఎమ్మెల్యే కావాలని డీజీపీ పదవికి గుడ్బై- టికెట్ ఇవ్వని జేడీయూ - బీహార్ ఎన్నికల సిత్రాలు
ఈ నెల 28 నుంచి ప్రారంభమయ్యే మూడు దశల బీహార్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధుల జాబితాను ప్రధాన కూటములు తాజాగా ప్రకటించాయి. ఇందులో పలు చిత్రాలు చోటు చేసుకున్నాయి. ప్రధానంగా రాజకీయ అరంగేట్రం కోసం ఎమ్మెల్యే టికెట్ ఆశించిన బీహార్ తాజా మాజీ డీజీపీ గుప్తేశ్వర్ పాండేకు జేడీయూ టికెట్ దక్కలేదు. అసలే హోరాహోరీగా సాగుతున్న ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలన్న పట్టుదలగా ఉన్న జేడీయూ.. కీలకమైన స్ధానాల్లో ఆచితూచి ఎంపికలు చేసింది. ఇందులో గుప్తేశ్వర్కు నిరాశ తప్పలేదు.
ఈ ఏడాది సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య వ్యవహారంలో వ్యక్తిగత వ్యాఖ్యలు చేసి వార్తల్లో వచ్చిన బీహార్ డీజీపీ గుప్తేశ్వర్ పాండే ఆ తర్వాత రాజకీయాల్లోకి సులువుగా అడుగుపెట్టవచ్చని భావించారు. అనుకున్నట్లుగానే అధికార జేడీయూలో చేరిపోవడమే కాకుండా టికెట్ కూడా ఆశించారు. తన స్వస్ధలమైన బక్సర్ నుంచి బరిలోకి దిగాలని అనుకున్నారు. కానీ జేడీయూ-బీజేపీ ఒప్పందంలో భాగంగా అధికార పార్టీ ఆ టికెట్ను కాషాయ నేతలకు ఇచ్చేసింది. దీంతో ఆయన తీవ్ర నిరాశకు లోనయ్యారు. తాను ఈ ఎన్నికల్లో పోటీ చేయబోవడం లేదని గుప్తేశ్వర్ ప్రకటించారు. బీహార్ ప్రజాసేవకు అంకితమవుతానని ఆయన ప్రకటించారు.
వ్యక్తిగత జీవితంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానని, జీవితాంతం ప్రజాసేవకు అంకితమయ్యానని, భవిష్యత్తులోనూ అదే బాటలో సాగుతానని మాజీ డీజీపీ తన ఫేస్బుక్ పోస్టులో తెలిపారు. హోరాహోరీగా సాగుతున్న బీహార్ ఎన్నికల్లో అధికార జేడీయూతో మిత్రపక్షంగా ఉంటూనే ఆ పార్టీని దెబ్బతీసేందుకు బీజేపీ నేతలు లోక్జనశక్తిని స్వతంత్రంగా బరిలోకి దింపారు. దీంతో అసలే ఒత్తిడిలో ఉన్న జేడీయూ పది మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను కాదని మరీ ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి టికెట్లు ఇచ్చింది. దీంతో గుప్తేశ్వర్ వంటి వారికి గట్టి షాక్ తప్పలేదు.