మగాళ్ల గదుల్లోనే మహిళల పొలిటికల్ కెరీర్ స్టార్ట్ ..
బిహార్కు చెందిన స్వతంత్ర ఎంపీ రాజేశ్ రంజన్ అలియాస్ పప్పూ యాదవ్ మహిళలపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర ఆగ్రహాన్ని, విమర్శలను రేకెత్తించాయి. "మహిళల రాజకీయ జీవితాలు మగాళ్ల గదుల్లోనే మొదలవుతాయి" అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సమాజంలో చర్చనీయాంశంగా మారాయి.
ఇటీవల పార్లమెంట్లో ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోయిన సందర్భంలో పప్పూ యాదవ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన పలువురు రాజకీయ నాయకులను "రాబందులు"గా అభివర్ణించారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే ఉద్దేశ్యంతో ప్రవేశపెట్టిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లును నియోజకవర్గాల పునర్విభజనతో ముడిపెట్టడాన్ని ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి.

దీంతో లోక్సభలో ఆ బిల్లుకు రాజ్యాంగ సవరణకు అవసరమైన మూడింట రెండొంతుల మెజారిటీ లభించలేదు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై చేసిన వ్యాఖ్యల పరంపరలో పప్పూ యాదవ్ మరింత దిగజారి, "అమెరికా నుంచి ఇండియా వరకు మహిళలపై గృహహింసకు పాల్పడేవారు, వాళ్లను చెడుగా చూసేవాళ్లు రాజకీయ నాయకులే" అని పూర్ణియా ఎంపీ పప్పూ యాదవ్ వ్యాఖ్యానించారు.
ఆయన ఇంకా మాట్లాడుతూ, "ఓ నాయకుడి గదిలోకి వెళ్లకుండా 90 శాతం మహిళలు రాజకీయాల్లో ఉండలేరు. రోజూ జరిగేది ఇదే. రాజకీయ నాయకుల సీసీటీవీ ఫుటేజీలు ప్రతిరోజూ బయటకు వస్తున్నాయి. మహిళలను లైంగికంగా వేధించడం ఇప్పుడు ఒక సంస్కృతిగా మారిపోయింది" అని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.
ఈ వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తీవ్రస్థాయిలో మండిపడింది. బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా మాట్లాడుతూ, పప్పూ యాదవ్ చేసిన ప్రకటన మహిళల పట్ల ప్రతిపక్షాల మనస్తత్వానికి అద్దం పడుతోందని విమర్శించారు.
పూనావాలా మాట్లాడుతూ, "కాంగ్రెస్ పార్టీ, దాని మిత్రపక్షాలు మరోసారి మహిళా వ్యతిరేకులని నిరూపించుకున్నాయి. మహిళా రిజర్వేషన్కు వ్యతిరేకంగా ఓటు వేయడమే కాకుండా, రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడై కాంగ్రెస్కు మద్దతిచ్చే పప్పూ యాదవ్ రాజకీయాల్లోని మహిళలపై అత్యంత అవమానకరమైన, ద్వేషపూరితమైన, నీచమైన వ్యాఖ్యలు చేశారు" అని అన్నారు.
రాజకీయాల్లో ఉన్న 90 శాతం మహిళలు ఒక పురుషుడి గదిలోకి వెళ్లకుండా రాణించలేరని యాదవ్ చేసిన వ్యాఖ్యలు అత్యంత హేయమైనవని పూనావాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో "నేను అమ్మాయిని, నేను పోరాడగలను" అనే నినాదంతో మహిళల హక్కుల కోసం పోరాడిన ప్రియాంక గాంధీ, యాదవ్ వ్యాఖ్యలపై ఎందుకు మౌనంగా ఉన్నారని ఆయన ప్రశ్నించారు.
బీజేపీ నాయకురాలు చారు ప్రజ్ఞ స్పందిస్తూ, పూర్ణియా ఎంపీ యాదవ్ వ్యాఖ్యలు ఆయన మనస్తత్వాన్ని, మహిళలను ఆయన చూసే విధానాన్ని స్పష్టంగా ప్రతిబింబిస్తున్నాయని అన్నారు. "అదే దురదృష్టకరమైన నిజం. ఆయన లాంటి వ్యక్తి పలుమార్లు పార్లమెంట్ సభ్యుడిగా ఉండటం దురదృష్టకరం కాదా?" అని ఆమె ప్రశ్నించారు.
ఆయనను పార్లమెంట్ నుంచి సస్పెండ్ చేయాలని, ఎన్నికలలో పోటీ చేయకుండా నిషేధించాలని చారు ప్రజ్ఞ డిమాండ్ చేశారు. ఈ విషయంలో రాహుల్ గాంధీ, ఆర్జేడీ అధినేత తేజస్వి యాదవ్ తమ వైఖరిని స్పష్టం చేయాలని ఆమె సూచించారు. ఈ వివాదంపై బీహార్ రాష్ట్ర మహిళా కమిషన్ తీవ్రంగా స్పందించి, పప్పూ యాదవ్కు నోటీసులు జారీ చేసింది.












Click it and Unblock the Notifications