బీహార్ సంక్షోభానికి తెర: రేపే సీఎంగా నితీష్ కుమార్, డిప్యూటీగా తేజస్వికి అవకాశం!
పాట్నా: బీహార్ రాష్ట్రంలో ఏర్పడిన రాజకీయ సంక్షోభానికి తెరపడింది. బీజేపీతో తెగదెంపులు చేసుకున్న జేడీయూ అధినేత నితీష్ కుమార్.. మరోసారి ఆర్జేడీ-కాంగ్రెస్-లెఫ్ట్ సారథ్యంలోని మహాఘటబంధన్తో చేతులు కలిపారు. దీంతో బీహార్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరేందుకు సిద్ధమైంది. ఇప్పటికే సీఎం పదవికి నితీష్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
Recommended Video
బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు బీహార్ సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉంది. ఆర్జేడీ సారథ్యంలోని ఏడు పార్టీలతో కూడిన మహాఘటబంధన్ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన నితీష్.. బీహార్ గవర్నర్ను కూడా కలిశారు.
ఈ ఒక్కరోజే నితీష్.. గవర్నర్ ఫాగు చౌహాన్ను రెండుసార్లు కలుసుకున్నారు. మొదటి భేటీలో తన రాజీనామాను అందజేసిన నితీష్.. రెండోసారి కలిసినప్పుడు మహాఘటబంధన్ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు.
కాగా, తమకు ఏడు పార్టీల మద్దతు ఉందని, 164 మంది ఎమ్మెల్యేల బలం ఉందని నితీష్ కుమార్ అంతకుముందు వెల్లడించారు. జేడీయూ ఎమ్మెల్యేలు, ఎంపీల కోరిక మేరకే తాము బీజేపీతో తెగదెంపులు చేసుకున్నామని నితీష్ స్పష్టం చేశారు. ఎన్డీఏ నుంచి బయటికి రావాలని నేతలంతా కోరడంతోనే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.
మరోవైపు, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ బీజేపీపై విమర్శలు గుప్పించారు. తమతో పొత్తుపెట్టుకున్న పార్టీలను నిర్వీర్యం చేయడమే బీజేపీ పని విమర్శించారు. అయితే, నితీష్ కుమార్ కొంత ముందుగానే మేల్కొన్నారని, భారీ నష్టాన్ని అడ్డుకున్నారని అన్నారు. పంజాబ్, మహారాష్ట్రలో అదే జరిగిందన్నారు.