షాక్: మంత్రగాడి కౌగిట్లో నితీష్ కుమార్, లాలుపై ఫైర్
పాట్నా: బీహార్ ముఖ్యమంత్రి, జెడియూ సీనియర్ నేత నితీష్ కుమార్ ఓ మంత్రగాడిని కలవడం చర్చనీయాంశంగా మారింది. మంత్రగాడితో అతను కలిసిన వీడియో బయటకు పొక్కింది. దీనిపై విపక్షాలు భగ్గుమన్నాయి.
నితీష్ను మంత్రగాడు ఆలింగనం చేసుకుని ముద్దు పెట్టుకోవడం వీడియోలో ఉంది. ఈ క్రమంలో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ను మంత్రగాడు దూషించాడని తెలుస్తోంది. ఈ విషయం లాలూ వరకు పాకడంతో ఆయన స్పందించారు. తానే పెద్ద మాంత్రికుడినని లాలూ ప్రసాద్ అన్నారు.
బీహార్ ఎన్నికల నేపథ్యంలో ఇప్పుడు ఈ వీడియో హల్చల్ చేస్తోంది. నితీష్ కుమార్ ఎన్డీయే కూటమి పైన గెలిచి మళ్లీ ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని ఉవ్వీళ్లూరుతున్నారు. అయితే, తాంత్రికుడితో సమావేశమైనప్పటి వీడియో ఆ పార్టీని కలవరపెడుతోంది.
వీడియోలో.... నితీశ్ కుమార్ తమ పార్టీ మొకామా అభ్యర్థి నీరజ్ కుమార్తో కలిసి తాంత్రికుడి ఆశ్రమానికి వెళ్లారు. అక్కడ మంచంపై నితీశ్ కూర్చొని ఉండగా ఆయన వద్దకు తాంత్రికుడు వచ్చి ఆశీర్వదిస్తూనే గట్టిగా కౌగిలించుకున్నాడు. పైగా ముద్దుల వర్షం కురిపించాడు.
నితీశ్ జిందాబాద్.. లాలూ ముర్దాబాద్(డౌన్ డౌన్) అంటూ సదరు తాంత్రికుడు నినాదాలు చేశాడు. సన్మార్గుడు కానీ ఆర్జేడీ అధినేత లాలూతో కలిసి ఎన్నికల్లో పోటీ చేయడం పెద్ద తప్పుగా నితీశ్ను తాంత్రికుడు హెచ్చరించినట్టుగా వీడియోలో ఉంది.
ఈ వీడియోను శనివారం కేంద్ర మంత్రి, బీజేపీ నేత గిరిరాజ్ సింగ్ విడుదల చేశారు. జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ కూటమిగా బీహార్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. కూటమి ఏర్పాటు సమయంలోనే తాంత్రికుడితో నితీశ్ సమావేశమయ్యారని, ఎన్నికల్లో గెలిచేందుకు ఎంతకైనా ఆయన తెగిస్తారని గిరిరాజ్సింగ్ దుయ్యబట్టారు.
లాలూను సైతాన్ పూనిందని నితీశ్ ఒప్పుకున్నట్టున్నారు. అందుకేనేమో ఆయన తాంత్రికుడ్ని కలిశారు? అని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో ఓటమి భయంతోనే తాంత్రికుడ్ని నితీశ్ కలిశారని, ఎంత మంది తాంత్రికులను కలిసినా ఆయన ఓటమి ఖాయమని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించారు.
సోషలిస్టు నేతగా చెప్పుకొనే నితీశ్.. తాంత్రికుడ్ని కలవడం ద్వంద్వ విధానానికి నిదర్శనమని మాజీ సీఎం జీతన్రాం మాంఝీ దుయ్యబట్టారు. ఓటమి భయంతోనే నితీష్ మంత్రగాళ్లను ఆశ్రయిస్తున్నారని బీజేపీ ఎద్దేవా చేసింది. నితీష్ పని అయిపోయిందని పేర్కొంది.