అమెరికాలో బీహారీలను చూసి సంతోషపడ్డా: మోడీ
పాట్నా/న్యూఢిల్లీ: బీహార్ ప్రజలు ఈసారి రెండుసార్లు దీపావళి పండుగ జరుపుకుంటారని ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం నాడు అన్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీహార్లోని బాంకాలో శుక్రవారం నిర్వహించిన ప్రచార సభలో మాట్లాడారు.
బాంకాలో ఎన్నికల ప్రచార సభకు ఇంతమంది రావడం తనకు సంతోషం కలిగించిందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తమదే అని ధీమా వ్యక్తం చేశారు. బీహార్ ప్రజలు... ఆనవాయితీగా వచ్చే దీపావళి పండుగతో పాటు, ఎన్నికల్లో గెలుపు అనంతరం మరో దీపావళిని జరుపుకుంటారన్నారు.
రాష్ట్రం ఇప్పటికే పలు సమస్యలతో సతమతమవుతుందన్నారు. బీహార్ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమన్నారు. సభకు వచ్చిన జన ప్రవాహాన్ని చూస్తుంటే బీజేపీది గెలుపు ఖాయమనిపిస్తుందన్నారు. రాష్ట్రంలో కొందరు కుల రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.

ఈ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమన్న పార్టీకే ఓటేయండి అని విజ్ఞప్తి చేశారు. బీహార్లో ఉద్యోగాలు, అభివృద్ధి విధానాల రూపకల్పన అవసరమన్నారు. ఉపాధి లేకే యువత వలస బాట పడుతోందన్నారు.
తాను అమెరికా పర్యటనలో బీహార్ ప్రజలను కలుసుకున్నానని, వారు సాధించిన విజయాలు చూసి ముగ్దుడనయ్యానన్నారు. ఎవరికో ప్రయోజనం చేయాలని బీహార్ ప్యాకేజీ ప్రకటించలేదన్నారు. ప్యాకేజీ పొందడం రాష్ట్ర ప్రజల హక్కు అని ప్రధాని చెప్పారు.
మోడీపై సీఎం కేజ్రీవాల్ విమర్శలు
ప్రధాని నరేంద్ర మోడీపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పరోక్ష విమర్శలు గుప్పించారు. స్వచ్ఛ భారత్ అంటూ పాటలు పాడితే వీధులు శుభ్రం కావన్నారు. కార్యక్రమాలకు తగ్గట్టుగా కార్యాచరణ ఉండాలన్నారు. ఫోటోల కోసం ఏడాదికొకసారి వీధులు శుభ్రం చేస్తే స్వచ్ఛ భారత్ కల నెరవేరదన్నారు. ఢిల్లీలో కొత్తగా 350 పబ్లిక్ టాయిలెట్స్ను ప్రారంభించామని చెప్పారు.












Click it and Unblock the Notifications